రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(PawanKalyan) తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలసదారులు వచ్చారన్నారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్కత్తా నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారని పేర్కొన్నారు. రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయని.. వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోందన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ అన్నారు. అయితే రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారని చెప్పారు. రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ఉందన్నారు. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాలని సూచించారు. దేశ అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు లేఖ రాశానని పవన్ వెల్లడించారు.