Mahesh Kumar Goud Angry on Minister Ponguleti: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహ: వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలా మీడియా ముందు ప్రకటన చేస్తారని సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఎన్నికల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఇంలాంటి సున్నితమైన అంశాలను మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని.. ముందుగానే మీడియాకు తెలపడం సరైన పద్థతి కాదని అభిప్రాయపడ్డారు. అలాగే ఒకరి మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశంపై మరో మంత్రి ఎలా మాట్లాడతారని ధ్వజమెత్తారు.
అంతేకాకుండా న్యాయస్థానాల పరిధిలో ఉన్న వివాదాస్పద అంశాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి మంత్రి తమ శాఖ పరిధిలోని అంశాల పట్ల మాత్రమే స్పందించాలని ఆదేశాంచారు. ఇలాంటి తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ తరహా ప్రకటనలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడతాయని తెలిపారు. ఏ విధమైన ప్రకటనలు అయినా సరే పార్టీతో సంప్రదించకుండా చేయవద్దని స్పష్టం చేశారు.
కాగా ఆదివారం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. జూన్ నెలాఖరున ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని వెల్లడించారు. మంత్రి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఎన్నికల సమరానికి దారి తీసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి చేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు సిద్ధం కావడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. అప్పుడే రాజకీయ దుమారం రేగడంతో టీపీసీసీ చీఫ్ మంత్రి పొంగులేటిపై సీరియస్ అయ్యారు.