కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు నాయుడు కృషితో పోలవరం పనులు వేగం పుంజుకున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్ట్ కు రూ. 5052 కోట్ల నిధులు అడ్వాన్స్ గా రావడం జరిగింది అని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం విడుదల చేసిన పోలవరం రీయింబర్స్మెంట్ నిధులను దారి మళ్లించి ప్రాజెక్ట్ ను విధ్వంసం చేసింది అని ఆరోపించారు.
ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు, పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ, CWC, PPA లను ఎప్పటికప్పుడు సమన్వయ పరుచుకుంటుందని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.
2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా, డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం రెండు కట్టర్లను ఉపయోగిస్తూ.. 136 మీటర్ల పొడవున, 6700 చదరపు మీటర్లు నేటికి పూర్తి చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. ఏప్రిల్ మొదటివారం నుంచి డి వాల్ నిర్మాణానికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి రానుందన్నారు. 7 ఏళ్ల తర్వాత నిర్వాసితుల బాధలను ఉపశమించడానికి.. కూటమి ప్రభుత్వం 990 కోట్ల రూపాయలను ఒకే విడతగా వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.