Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం

Vijayawada: వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం

23 మందికి దక్కిన వైఎస్ఆర్ లైఫ్ టైం అవార్డ్స్

విజయవాడ ఏ– కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానం చేశారు.

- Advertisement -

వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల– 2023 ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం వైయస్‌ జగన్‌.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

ఎందరో మహానుభావులు అందరికీ ఈ శుభ సందర్భంలో వందనాలు. ఈరోజు ఇక్కడ మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయులు గవర్నర్‌ గారికి, నా మంత్రివర్గ సహచరులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సన్మాన స్వీకర్తలు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

ఆంధ్రప్రదేశ్‌ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. వరుసగా ఈరోజుకు లెక్కేసుకుంటే ఇది మూడో సంవత్సరం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం.
మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్సార్‌ అవార్డులతో సత్కరించే ఈ సంప్రదాయం మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం.
మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి.

ఈ సంవత్సరం 27 మందికి వైఎస్సార్‌ అవార్డులతో సత్కరిస్తున్నాం. ఇందులో నలుగురికి అచీవ్‌మెంట్, 23 మందికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేయబోతున్నాం.
తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్‌ వైయస్సార్‌ గారి పేరిట ఏటా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తుంది.

డాక్టర్‌ వైయస్సార్‌ గారి హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకన్నా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా చూసినవే.

ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగుళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, మన హేతు వాదానికి… సాటి మనుషులకు చేస్తున్న సేవలకు ఇలా పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది.

ఈ అవార్డులు అందుకుంటున్నవారు అంతా కూడా తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించిన వారు, మన వారసత్వాన్నితమ భుజాల మీద మోసిన వారు. వీరంతా మన జాతి సంపద.
ఈరోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ మూడు సంవత్సరాల్లో సామాజిక న్యాయం సంపూర్ణంగా వర్ధిల్లింది.


ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు. ‎

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News