Test Tube Baby case: సంతానం లేని దంపతులు ఎంతో ఆశతో ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తున్న వేళ, కొన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల్లో చోటుచేసుకుంటున్న అనుచిత చర్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లో ఉన్న ఓ ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్ “సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్” పై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ, భర్త వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని కోరగా, ఆ ఆసుపత్రిలో వారు అనుమతించని రీతిలో వేరే వ్యక్తి స్పెర్మ్ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి.
దంపతులు చికిత్స అనంతరం శిశువు డీఎన్ఏ పరీక్ష చేయించగా, ఫలితాల్లో శిశువు జన్యు కణాలు భర్తవాటితో పోలి రాకపోవడం గమనించారట. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి బెజవాడలోని అదే పేరుతో ఉన్న బ్రాంచ్కు సంబంధించి కీలక సమాచారం సేకరించారు.
దీంతో విజయవాడలో ఉన్న డాక్టర్ను గుర్తించి, ఆమెను హైదరాబాద్కు తరలించినట్టు సమాచారం. గతంలోనూ ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విశాఖపట్నంలోనూ ఇటువంటి కేసులో డాక్టర్ అరెస్ట్కు గురయ్యారు. 2018లో ఈ ఆసుపత్రి లైసెన్సు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసినప్పటికీ, 2020లో మరో పేరుతో పునఃప్రారంభించారని పోలీసులు గుర్తించారు.
తాజా ఘటనపై ఆరా తీస్తున్న దర్యాప్తు బృందాలు, గతంలో ఈ సెంటర్లో ఐవీఎఫ్ విధానంలో జన్మించిన శిశువుల వివరాలు, తల్లిదండ్రులకు అందించిన సమాచారం సరైనదేనా అనే కోణంలో విచారణను ముమ్మరం చేశాయి. దీనితో టెస్ట్ ట్యూబ్ సెంటర్ల విధానాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


