Tirumala: టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం)లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా వాళ్లను కొనసాగించడంపై ఆయన మండిపడ్డారు. శ్రీవారి వద్ద ఏ పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని బండి సంజయ్ హితవు పలికారు.
బండి సంజయ్ జన్నదినం సందర్భంగా శుక్రవారం ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను బండి సంజయ్కు అందజేశారు. అనంతరం శ్రీనివాసుని ఆలయం వెలుపల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
టీటీడీలో 1000 మంది అన్యమతస్తుల ఉద్యోగులు ఉంటే ఏం చేస్తున్నారని టీటీడీని నిలదీశారు. చర్చి, మసీదుల్లో హిందువులకు జాబ్లు ఇస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా హిందేయేతరులను కొనసాగించే ఆనవాయితీ ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే అన్యమతాలకు చెందిన వెయ్యి మంది ఉద్యోగులను తొలగించాలని బండి డిమాండ్ చేశారు.
కరీంనగర్లో భూమిపూజ చేసిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని బండి సంజయ్ కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేయాలని విన్నవించారు. తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను, అభివృద్ధికి నోచుకోని పురాతన ఆలయాలకు టీటీడీ నిధులు మంజూరు చేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
ALSO READ: https://teluguprabha.net/crime-news/tirumala-dairy-manager-commits-suicide-in-chennai/
తిరుమల హిందువుల ఆస్తి అని అన్యమతస్తులను తప్పించడంలో ఓటు బ్యాంకు రాజకీయాలు సరైందికాదని బండి సంజయ్ పార్టీలు, ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి హిందుమతం, దేవుడిపై నమ్మకం లేదు. అట్లాంటోళ్లకు ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? పద్దతి మంచిది కాదు” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. “ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోంది. స్వామివారిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారు. హిందువులంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడో వాళ్లను నియమించారని చెప్పి తప్పించుకోవడం సరికాదు. తక్షణమే వాళ్లను తొలగించాలి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లను కొనసాగించడం కరెక్ట్ కాదు” అని కూడా బండి సంజయ్ అన్నారు.
“ఈ రోజు నా జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రశాంత వాతావరణంలో జీవించాలి. ఈ దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసి కట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలి. శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం, దేశాభివ్రుద్ధి కోసం, ప్రజల సంక్షేమం అహర్నిశలు పనిచేస్తున్న ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా శక్తి సామర్థ్యాలు కల్పించాలని స్వామి వారిని వేడుకున్నా” అని చెప్పారు.
బండి సంజయ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.


