Drug Park Tension: అనకాపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన బల్క్ డ్రగ్ పార్కు ప్రాజెక్టు చుట్టూ వివాదం మళ్లీ దుమారం రేపుతోంది. నక్కపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో 814 ఎకరాల భూమిపై జరుగుతున్న రెండో దశ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయగా, పలు ప్రదేశాల్లో ముందస్తు అరెస్టులు కూడా జరిగాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (APIIC), పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. ఇప్పటికే ఈ పార్కు కోసం 1,514 ఎకరాల భూమిని గుర్తించగా, 700 ఎకరాలకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ మొదటి దశలో పూర్తయింది. ఇప్పుడు మిగిలిన 814 ఎకరాలపై ప్రజాభిప్రాయ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ భూములు సీహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, ఎన్. నర్సాపురం, ఉపమాక, ఎస్.రాయవరం మండలంలోని గుడివాడ గ్రామాల పరిధిలో ఉన్నాయి. ప్రతినిధుల ప్రకారం, సదస్సులో 15 నుంచి 20 మందికి అభిప్రాయాలు వ్యక్తపర్చే అవకాశం కల్పించబడింది.
అయితే, ప్రతిపాదిత పార్కు వల్ల తమ జీవనోపాధికి ప్రమాదం వాటిల్లుతుందని భావిస్తున్న రైతులు, మత్స్యకారులు.. ముఖ్యంగా సీపీఎం, వైసీపీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజాభిప్రాయ సభ ఉత్కంఠతతో కూడిన వాతావరణంలో కొనసాగుతోంది.


