AP BJP President Madhav: ప్రకాశం జిల్లాలోని బీజేపీ నేతలు, కార్యకర్తల్లో తాజాగా గణనీయమైన చైతన్యం కనిపిస్తోంది. పార్టీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా VV నరసింహ మాధవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా స్థాయిలో రాజకీయ కదలికలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, మాధవ్ ఒంగోలు పర్యటనకు అనూహ్యంగా పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు స్వాగతం తెలిపేందుకు సిద్ధమయ్యారు. గతంలో నాయకులు పార్టీ కార్యక్రమాలకు గాలించనట్టే ఉండగా, ఇప్పుడు అయితే ఒకరికొకరు పోటీగా ఏర్పాట్లు చేస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
బుధవారం రాత్రి 10:30కి ఒంగోలుకు చేరుకున్న మాధవ్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య కూడా గడిపేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించారు. ఉదయం 6 గంటలకు “చాయ్ పే చర్చ” కార్యక్రమంలో విందుభోజనం హోటల్ వద్ద కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రకాశం పంతులు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అక్కడినుంచి పాత మార్కెట్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించగా, అందులో మాధవ్ పాల్గొన్నారు.
తరువాత రిమ్స్ సమీపంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో బీజేపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అక్కడ మాధవ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం 5 గంటలకు వల్లూరు వద్ద మేథావుల సమావేశానికి హాజరుకానున్నారు. అక్కడ నుంచి ఓ పార్టీ నాయకుడి ఇంట్లో భోజనం చేసి, రాత్రికి ఒంగోలులో బస చేసి, మరుసటి రోజు నెల్లూరుకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రజలతోనూ, పార్టీ కార్యకర్తలతోనూ మమేకం కావడం విశేషం.
ఇదిలా ఉండగా, ఇటీవల బీజేపీలోకి వచ్చిన క్విస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి కల్యాణ్ చక్రవర్తి ప్రవేశం జిల్లా పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయనను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించిన కేంద్ర పార్టీ నాయకత్వం, జిల్లా నేతల ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఆయనతో పాటు లంకా దినకర్ (20 సూత్రాల అమలుకై కమిటీ చైర్మన్), జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు శివారెడ్డి, ఒంగోలు ఇన్చార్జి యోగయ్య యాదవ్ తదితరులు కలిసి మాధవ్ పర్యటన విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇకపై జిల్లాలో బీజేపీ కార్యకలాపాలు మరింత ఉత్సాహంగా సాగనున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


