మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి సీఆర్జెడ్ ఉల్లంఘనల వ్యవహారంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భీమిలి బీచ్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను GVMC కూల్చివేస్తోంది. నేహారెడ్డికి చెందిన ఈ స్థలంలో భారీ నిర్మాణాలు చేపట్టారు. ఇసుక తిన్నెలపై భారీగా గుంతలు తవ్వి, స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు.
సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ నిర్మాణాలు అక్రమమని తేలడంతో హైకోర్టు కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈఎక్స్ 200 సామర్థ్యం గల బ్రేకర్, బకెట్ యంత్రాలతో అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను 10 అడుగుల లోతు వరకు తవ్వి తొలగిస్తున్నారు.
భీమిలి బీచ్లో సముద్రానికి అతి సమీపంలో CRZ నిబంధనలకు విరుద్ధంగా విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీఎల్వీఎన్ మూర్తి యాదవ్ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. భీమిలి CRZ జోన్ పరిధిలో శాశ్వత రెస్టారెంట్లు, బార్ల నిర్మాణంతో తాబేళ్ల మనుగడకు ముప్పు పొంచి ఉందని గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు మరో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సీఆర్జడ్ పరిధిని నిర్ణయించి, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించింది.