New Delhi: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరింత శక్తివంతంగా తిరిగి రంగంలోకి దిగుతోంది. 4జీ నెట్వర్క్ విస్తరణను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు రూ.47,000 కోట్ల పెట్టుబడి మంజూరు చేసింది. గతేడాది ఖర్చయిన రూ.25,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు స్థాయి పెట్టుబడి.
ఈ సమాచారాన్ని టెలికాం విభాగం (DoT) అధికారికంగా వెల్లడించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఇది బీఎస్ఎన్ఎల్ చరిత్రలోనే అతి పెద్ద మూలధన వ్యయం అని చెప్పారు. గత ఏడాది 4జీ సేవల కోసం లక్ష టవర్ల ఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్ రూ.25,000 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది టెక్నాలజీ మౌలిక వసతుల విస్తరణ కోసం రూ.47,000 కోట్లు వెచ్చించనుంది.
Read more: https://teluguprabha.net/business/india-wpi-inflation-falls/
గత ఏడాది జరిగిన టెండర్లలో, 4జీ టెక్నాలజీ సాధనాల సప్లయ్ కోసం టీసీఎస్, సీ-డాట్ నేతృత్వంలోని కన్సార్టియం మెజారిటీ ఆర్డర్లను దక్కించుకుంది. ఈ ఏడాది కూడా వారే కీలక పాత్ర పోషించనున్నారని వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బీఎస్ఎన్ఎల్ సర్కిళ్ల ప్రధానులతో మంత్రి సింధియా సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ వ్యాపార విభాగాల వృద్ధికి గడువు పెట్టారు. మొబైల్ సేవలు – 50% వృద్ధి, ఎంటర్ప్రైజ్ వ్యాపారం – 25-30%, ఫిక్స్డ్ లైన్ సేవలు – 15-20% వృద్ధిలోకి తీసుకురావాలని నిర్దేశించారు.
దీంతో పాటు, వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU)ను కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ARPU రూ.40 నుంచి రూ.175 మధ్య ఉండగా, జియో రూ.208, ఎయిర్టెల్ రూ.250 స్థాయిలో సగటు ఆదాయాన్ని పొందుతున్నాయి.
Read more: https://teluguprabha.net/business/sbi-agniveer-collateral-free-loan-independence-day-offer/
బీఎస్ఎన్ఎల్ ఇటీవల “ఫ్రీడమ్ ఆఫర్” పేరుతో వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ పథకంలో కేవలం రూ.1కే అపరిమిత కాల్స్ లభిస్తున్నాయి. ఇది మార్కెట్లో తక్కువ ధరలో ఎక్కువ సేవలను అందించాలన్న ప్రయత్నంలో భాగంగా విశ్లేషించవచ్చు.


