Payments: భారతదేశం డిజిటల్ ఎకానమీ దిశగా ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలే సాక్ష్యం. దేశంలో పండుగ సీజన్ మొదలవడంతో, యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ చరిత్ర తిరగరాశాయి. ముఖ్యంగా దీపావళి షాపింగ్ జోరు, బహుమతుల పంపకాలు, ఆన్లైన్ కొనుగోళ్ల కారణంగా డిజిటల్ చెల్లింపుల రంగం ఊహించని ఎత్తులకు చేరింది.
అక్టోబర్ నెలలో రికార్డుల మోత
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ సంచలనాన్ని స్పష్టం చేస్తున్నాయి.అక్టోబర్ 20న ఒక్క రోజులోనే ఏకంగా 74 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. ఇది యూపీఐ చరిత్రలో ఇప్పటివరకు నమోదు అయిన ఆల్-టైమ్ రికార్డు. అక్టోబర్ నెలలో యూపీఐ ద్వారా జరుగుతున్న రోజువారీ లావాదేవీల మొత్తం విలువ సగటున రూ. 94,000 కోట్లకు చేరుకుంది. ఇది గత నెల (సెప్టెంబర్) కంటే సుమారు 13 శాతం ఎక్కువ. సాధారణంగా నెల మధ్యలో తగ్గే లావాదేవీల సంఖ్య ఈసారి పండుగ ప్రభావంతో పెరిగింది. అక్టోబర్ నెల 20 నాటికే రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా ఆరుసార్లు లక్ష కోట్ల రూపాయల మార్కును దాటడం విశేషం. సెప్టెంబర్లో ఈ మార్కు కేవలం మూడుసార్లే నమోదైంది.
డిజిటల్ ఎకానమీకి యూపీఐ ‘కింగ్’
ప్రస్తుత ధోరణి కొనసాగితే, ఈ అక్టోబర్ నెల ముగిసే సమయానికి మొత్తం యూపీఐ లావాదేవీల విలువ రూ. 28 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది గత నెల సృష్టించిన రూ. 25 లక్షల కోట్ల రికార్డును అధిగమించనుంది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో సుమారు 85 శాతం యూపీఐదే కావడం దీని ఆధిపత్యాన్ని నిరూపిస్తోంది. పండుగ సీజన్లో పెరిగిన వినియోగం, యూపీఐ చెల్లింపుల సులభత్వం, మరియు స్మార్ట్ఫోన్ వినియోగదారుల పెరుగుదల వంటి కారణాలు కలిపి యూపీఐని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన డిజిటల్ సాధనంగా మార్చాయి.
యూపీఐ రికార్డుల పరంపర… భారతదేశం డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని విజయవంతంగా స్వీకరించి, ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నదానికి ఈ గణాంకాలే నిదర్శనం.


