BSF Head Constable recruitment 2025 : దేశ సేవ చేయాలనే తపన, రక్షణ రంగంలో స్థిరపడాలనే ఆకాంక్ష ఉన్న యువతకు ఇది సువర్ణావకాశం! బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. పదో తరగతి అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించే ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అవివాహిత యువతీ యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంతకీ, మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? అర్హతలేంటి..? దరఖాస్తు చేసుకోవడం ఎలా.?
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, గ్రూప్-సి నాన్ గెజిటెడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పోస్టుల వివరాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1121 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని రెండు విభాగాలుగా విభజించారు.
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 910 పోస్టులు ఉన్నాయి.
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 211 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు – వయోపరిమితి : 1121 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు అవసరమైన అర్హతలు, వయసు నిబంధనలు కింది విధంగా ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు రుసుము
దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 24, 2025
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2025
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా, మాజీ సైనికోద్యోగుల (ESM) అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం – జీతభత్యాలు : అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పలు దశల్లో ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెడికల్ ఎగ్జామినేషన్, మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం (పే లెవల్-4 ప్రకారం) లభిస్తుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


