టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ వివాహానంతర రిసెప్షన్ వేడుక ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్కి సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. జూన్ 6వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ లోకేషన్లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగింది. ఎంతో సింపుల్గా జరిగిన ఈ వేడుక అనంతరం.. ఆదివారం జరిగిన రిసెప్షన్ వేడుక గ్రాండ్ గా నిర్వహించారు.
స్టైలిష్ లుక్తో అఖిల్-జైనబ్ జంట రిసెప్షన్ వేడుకలో మెరిశారు. అఖిల్ బ్రౌన్ కలర్ సూట్లో డాషింగ్గా కనిపించగా, జైనబ్ గోల్డ్ కలర్ లెహంగాలో రాయల్ లుక్తో ఆకట్టుకున్నారు. వేడుకలోకి వచ్చిన ప్రతి అతిథి ఈ జంటను ఆశీర్వదిస్తూ ఫోటోల ఫోజులిచ్చారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి, అక్కినేని ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులలో కొంతమంది కూడా రిసెప్షన్కి వచ్చారు.
సినీ రంగం నుంచి పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు హాజరయ్యారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రతతో కలిసి వేడుకకు వచ్చి, అఖిల్-జైనబ్లను ఆశీర్వదించారు. మెగా హీరో రామ్ చరణ్ ఉపాసనతో కలిసి వేడుకకు హాజరై, అఖిల్తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. హీరో నాని, హీరో నిఖిల్, హీరో అల్లరి నరేష్ కూడా తమ కుటుంబాలతో కలిసి వేడుకలో పాల్గొని, జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళ స్టార్ హీరో సూర్య ఈ వేడుకలో పాల్గొన్నారు.
దర్శక వర్గం నుంచి వెంకీ అట్లూరి, సుకుమార్, బుచ్చిబాబు సాన వంటి ప్రముఖులు వేడుకలో కనిపించారు. మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరై, నాగార్జున ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్యతో పాటు అక్కినేని కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అఖిల్, జైనాబ్ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతేడాది నవంబర్లో వీరి నిశ్చితార్థం జరిగిందని తెలిసింది. చివరికి ఈ ప్రేమకథ పెళ్లిగా రూపుదిద్దుకోవడంతో అక్కినేని ఫ్యామిలీ ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.