Akkineni Nagarjuna announces milestone film ‘King 100’: టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున తన కెరీర్లో వందో చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, దసరా పండుగ సందర్భంగా అట్టహాసంగా లాంచింగ్ వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు హాజరుకానున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఫిల్మ్ నగర్లో నడుస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని నాగార్జున ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. చిరంజీవి చేతుల మీదుగా తొలి క్లాప్ కొట్టించి సినిమాను ప్రారంభించాలని యూనిట్ భావిస్తోంది. అంతేకాకుండా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. నాగార్జునకు చిరంజీవి మంచి మిత్రుడు కాగా, ఎన్టీఆర్ను ఆయన తన పెద్ద కొడుకులా భావిస్తారు. అందుకే ఎన్టీఆర్ చాలా ఫంక్షన్లలో నాగార్జునను బాబాయ్.. అంటూ సంబోధిస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ హాజరైతే, ఈ లాంచింగ్ వేడుక సినీ పరిశ్రమలో ఒక పెద్ద ఈవెంట్గా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈవెంట్ గెస్ట్లుగా చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్..!
ఇక, నాగార్జున 100వ సినిమా విషయానికొస్తే, తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యాక్షన్, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాను పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా తీర్చిదిద్దనున్నారు. తన కెరీర్లో ప్రయోగాలు ఫలించనప్పుడు, ఫ్యామిలీ-యాక్షన్ చిత్రాలే నాగార్జునను నిలబెట్టాయి. అందుకే తన వందో సినిమా కోసం కూడా అదే ఫార్ములాను ఎంచుకుని, రిస్క్ లేని సేఫ్ గేమ్తో ముందుకు వెళుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నాగార్జున తన సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. సినిమాకు ‘100 నాటౌట్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ లాంచింగ్ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుండగా, అభిమానులు ఈ అపురూప ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తన 100వ చిత్రం జీవితంలో మరుపురాని చిత్రంగా మిగిలిపోవాలని భావిస్తున్నట్లు, ఖర్చుకు వెనకడుగు వేయకుండా కెరీర్లోనే భారీ బడ్జెట్తో దీన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నాగార్జున ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చిత్రం విజువల్ వండర్గా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగ్ కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే, నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జగన్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి.. కానీ, ఎట్టకేలకు కార్తీక్తోనే ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు కనిపిస్తోంది. 100వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో షూరూ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


