Mahavatar Narsimha Record: ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha). మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్తో సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ తాజాగా మరో ఘనతను సాధించి చరిత్ర సృష్టించింది. దేశంలోని యానిమేటెడ్ సినిమాల్లోనే ‘మహావతార్ నరసింహ’ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై వచ్చిన ఈ సినిమా, కేవలం 8 రోజుల్లోనే రూ.60.5 కోట్లు వసూళ్లను సాధించిందని (Mahavatar Narsimha Collections) నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘనత సాధించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా నిలిచిందని పేర్కొంది. అలాగే అమెరికాలో కూడా ఈ సినిమా విశేష ఆదరణతో వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది.
‘మహావతార్ నరసింహ’ చిత్ర దర్శకుడు అశ్విన్కుమార్ (Ashwin Kumar) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. భవిష్యత్తులో ఈ ఫ్రాంఛైజీలో లైవ్ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తే రాముడి పాత్రకు ఎవరిని ఎంపిక చేసుకుంటారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ఆయన రామ్చరణ్ను (Ram Charan) ఎంపిక చేసుకుంటానని తెలిపారు. దీంతో చరణ్ అభిమానులు ఈ కామెంట్ను విస్తృతంగా షేర్ చేసుకుంటున్నారు.
కన్నడ చిత్ర నిర్మాణ సంస్థల్లో టాప్గా నిలుస్తూ క్రేజీ భారీ బడ్జెట్ చిత్రాలను హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) నిర్మిస్తోంది. ఇప్పటికే కాంతార (Kantara) చిత్రంతో పాటు కెజియఫ్ మూవీతోనూ (KGF movie) పాన్ ఇండియా లెవల్లో ఈ సంస్థ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. కాంతార వంటి మీడియం బడ్జెట్ మూవీతో భారీ హిట్ను అందుకున్న హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు మరోసారి ‘మహావతార్ నరసింహ’ అలాంటి సక్సెస్నే సొంతం చేసుకుంది. భక్త ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు మధ్య భక్తికి సంబంధించిన నడిచిన కథాంశంతో సినిమా తెరకెక్కింది.
తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ (Geeta Arts) సంస్థ విడుదల చేసింది. కాంతార పార్ట్ వన్ను కూడా ఈ సంస్థనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసి హిట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మహావతార్ నరసింహను కూడా విడుదల చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.


