ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ పురస్కారం అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. తనకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారని అయితే సరైన సమయంలోనే తనకు పద్మభూషణ్ వచ్చిందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను నటించిన నాలుగు సినిమాలు ఘన విజయం సాధించడం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి కావడం, తాను సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పురస్కారం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని బాలయ్య వెల్లడించారు.