Thug Life: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) సినిమాలకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఆయన తాజాగా రూపొందించిన చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life). కమల్ హాసన్, శింబు, త్రిష (Trisha), నాజర్, అభిరామి తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకోలేకపోవడంపై మణిరత్నం క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన థగ్ లైఫ్ సినిమా ఫలితంపై స్పందిస్తూ, ప్రేక్షకులు తమ కలయికలో సినిమా అనగానే మరో క్లాసిక్ చిత్రాన్ని ఆశించారని అంగీకరించారు. అయితే అది సాధ్యపడలేదని ఆయన పేర్కొన్నారు.
కమల్ హాసన్ (Kamal Haasan), మణిరత్నంల కాంబినేషన్కు సినీ ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉంది. వారిద్దరి కలయికలో అప్పట్లో విడుదలైన ‘నాయకుడు’ (Nayakan) అనే చిత్రం నిజంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఆ తర్వాత వీరి కలయికలో మరో సినిమా రాలేదు. సుమారు 37 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ‘థగ్ లైఫ్’ సినిమా తెరకెక్కడంతో, ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం, ఆ అంచనాలను అందుకోవడంలో విజయం సాధించలేకపోయింది.
మణిరత్నం థగ్ లైఫ్ పరాజయం గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘మా ఇద్దరి నుంచి మరో ‘నాయకుడు’ను ఆశించిన వారికి నేను చెప్పగలిగేది ఒక్కటే. మమ్మల్ని క్షమించండి. ఆ సినిమా కంటే తక్కువ దాన్ని చేయడం మా ఉద్దేశం కాదు. అలాంటి ఆలోచన మాకెప్పుడూ లేదు. అలా ఎలా చేయాలనుకుంటాం. మేం పూర్తిగా భిన్నమైనదాన్ని అందించాలనుకున్నాం. ఎక్కువ అంచనా వేయడంతో మేం అనుకోని ఫలితాన్ని అందుకున్నాం. మేము అందించిన దానికంటే ఆడియన్స్ భిన్నంగా కోరుకున్నారని అర్థం చేసుకున్నాను’’” అని తెలియజేశారు.
‘నాయకుడు’ కంటే తక్కువ స్థాయిలో సినిమా తీయడం తమ ఉద్దేశం కాదని, తాము పూర్తిగా భిన్నమైనదాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించామని ఆయన వివరించారు. అయితే, మా కాంబో అనగానే సినిమాపై వచ్చిన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తాము ఊహించిన ఫలితాన్ని చూడటానికి కారణమయ్యాయని, మేం చేసిన సినిమాను మించింది ప్రేక్షకులు మా నుంచి ఆశించారని మణిరత్నం పేర్కొన్నారు. ప్రస్తుతం మణిరత్నం తన తదుపరి సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం.