Prasanth Varma: హను మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య విబేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఇద్దరి వాదనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ తనతో చేస్తానని కమిట్ అయిన సినిమాలను వేరే వాళ్లతో చేస్తున్నాడంటూ, తాను డైరెక్టర్ వల్ల నష్టపోయాను కాబట్టి రూ.200 కోట్లు అతను చెల్లించాలని నిరంజన్ రెడ్డి చాంబర్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్స్ అసోషియేషన్కు నిరంజన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చాడు.
ప్రశాంత్ వర్మ తనపై నిరంజన్ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించాడు. అధీర, మహాకాళి సినిమాలకు తాను దర్శకత్వం వహిస్తానని ఎప్పుడూ ఒప్పందం చేసుకోలేదని ఆయన పేర్కొన్నాడు. హను మాన్ సినిమా ఐపీ హక్కులు తనవే అని, జై హనుమాన్ను ఎవరూ క్లెయిమ్ చేయలేరని స్పష్టం చేశాడు. బ్రహ్మ రాక్షస్ మూవీ విషయంలోనూ ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలిపాడు ప్రశాంత్ వర్మ. హను మాన్ కోసం తాను రూ.15.82 కోట్లు తీసుకున్నట్లు చెప్పిన ప్రశాంత్… అధీర టీజర్ తయారీకి మాత్రమే ఒకటిన్నర కోట్లు అందుకున్నానని, సినిమా దర్శకత్వానికి కాదని ఆయన వివరణ ఇచ్చాడు.
ప్రశాంత్ వర్మ మరోసారి నిరంజన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. హను మాన్ సినిమా థియేట్రికల్, శాటిలైట్, మ్యూజిక్, డిజిటల్ హక్కులు తన దగ్గర ఉంటే 50 శాతం వాటా ఇస్తానని చెప్పి, ఆ హక్కులను వేరే వాళ్లకు అమ్మేలా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమా రూ.295 కోట్లు కలెక్ట్ చేసినా తనకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా, అబద్దాలు చెప్పి తప్పించుకుంటున్నారని ప్రశాంత్ ఆరోపించాడు.అంతేకాదు, హను మాన్ నుంచి వచ్చిన ఆదాయాన్ని డార్లింగ్, సంబరాల ఏటి గట్టు, బిల్లా రంగా భాషా వంటి ఇతర సినిమాలకు మళ్లించారని కూడా ఆయన సంచలన ఆరోపణ చేశాడు. ఈ వివాదం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందు ఉంది. మరి ఎలా పరిష్కరిస్తారని తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
హను మాన్ తర్వాత ప్రశాంత్ వర్మ రైటర్గా తన కథలను అందించే ప్రయత్నమైతే చేస్తున్నారు. రీసెంట్గా మహా కాళి సినిమా పోస్టర్ కూడా వచ్చింది. డైరెక్టర్గా మాత్రం ఆయన సినిమా చేసి ఏడాదిన్నర దాటేసింది. జై హనుమాన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికి ప్రశాంత్ వర్మ వెయిట్ చేస్తున్నారు. మరో వైపు ప్రభాస్తో బ్రహ్మ రాక్షస మూవీని తెరకెక్కించేలా ప్లానింగ్ కూడా జరుగుతోంది.
Also Read – India vs Australia: టీ20 సిరీస్లో భారత్ పుంజుకోగలదా?


