Manchu Mohan Babu- Vishnu Manchu: టాలీవుడ్ నటులు మంచు మోహన్బాబు, ఆయన తనయుడు విష్ణులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం గతంలో వారు నిర్వహించిన ధర్నాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నమోదుచేసిన కేసును కొట్టివేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Higj Court) ఈ ఏడాది జనవరి 2న ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది.
కేసు వివరాల్లోకెళ్తే.. మోహన్బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ (Sree Vidyanikethan) కళాశాలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం మోహన్బాబు, విష్ణులు 2019 మార్చి 22న సిబ్బంది, విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా తిరుపతి (Tirupati), మదనపల్లె రోడ్డుపై ర్యాలీగా సాగింది, దీనివల్ల ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిందని, అప్పట్లో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే, తాము ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా ధర్నా చేశామని, ఎన్నికల కోడ్ తమకు వర్తించకపోయినా తప్పుడు అభియోగాలు నమోదు చేశారని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని మోహన్బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసులోని నిజానిజాలు ట్రయల్కోర్టులో విచారణ ద్వారానే తేలాల్సి ఉందన్న కారణంతో హైకోర్టు వీరి క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ ఇద్దరూ ఈ ఏడాది మార్చి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జూలై 22న ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. చంద్రగిరి పోలీసుస్టేషన్లో 2019 మార్చి 23న నమోదుచేసిన ఎఫ్ఐఆర్ దాని ఆధారంగా దాఖలుచేసిన ఛార్జిషీట్ను కొట్టేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్లను కలిపి చదివిన తర్వాత అందులో పేర్కొన్న సెక్షన్లు వారికి ఎలా వర్తిస్తాయో అర్థం కావట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు గానీ, ప్రజలకు హాని తలపెట్టినట్లు గానీ చూపలేకపోయినట్లు సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఈ తీర్పుతో సినీనటులు మోహన్బాబు, మంచు విష్ణులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ ధర్నా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉండేవారు. తర్వాత జగన్ (Ys Jagan) పరిపాలన వచ్చింది. అప్పుడైనా ఫీజు రియంబర్స్ వస్తుందనుకంటే రాలేదని, తల బొప్పికట్టిందని, దాని గురించి తాను మాట్లాడాలనుకోవటం లేదంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మోహన్బాబు తెలియజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాము యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నట్లు మోహన్ బాబు పేర్కొన్నారు.


