Manchu Lakshmi comments on Betting App Promotion Case: సినీనటి మంచు లక్ష్మి ఇటీవల నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. దర్యాప్తు జరిగిన దాన్ని పక్కనపెట్టి మీడియా మరోదాన్ని హైలైట్ చేసిందని అసహనం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించాలని ఎన్ఫోర్డ్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావించడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ మొదలయ్యాయనే దానిపై వారు దృష్టిపెట్టాలి. బెట్టింగ్ యాప్స్ విచారణ అంశంపై మీడియాలో నాపై వచ్చిన వార్తలు చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే మేం విచారణ ఒక విషయంలో ఎదుర్కొంటే.. మీడియా మరోదాన్ని హైలైట్ చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో డబ్బు ఎలా సమకూరుతోంది? ఎక్కడికి వెళ్తోంది? అనే విషయంపై వారు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులకు నిధులు వెళ్తున్నాయా.. అనే దానిపై కూడా దృష్టిపెట్టారు. నాకు ఇవేవీ తెలియదు. 100 మంది ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారని తెలిపారు. ఆ జాబితాలో నేనూ ఉన్నానని చెప్పారు. అందుకే నేను విచారణకు వెళ్లాను. ఇదంతా ఒక్క నిమిషం పని’’ అని మంచు లక్ష్మి అన్నారు. అసలు ఈ యాప్లు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి. వీటి ఉనికి ఏంటి అనే పెద్ద సమస్యను అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదు.” అని ఈడీ అధికారులను సూటిగా ప్రశ్నించారు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు ఆగస్టులో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 13న మంచు లక్ష్మిని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో నటులు ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జులై 30న ప్రకాశ్ రాజ్, ఈ నెల 6న విజయదేవరకొండ, 11న హీరో రానా ఈడీ ముందు హాజరయ్యారు. ఆగస్టు 13న మంచు లక్ష్మీ విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్ కేసులో నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన మొత్తం 29 మంది సెలబ్రెటీలని ఈసీఐఆర్లో చేర్చింది.
READ ALSO: https://teluguprabha.net/national-news/delhi-teacher-ai-morphing-principal-obsession-arrest/
25 మంది సెలబ్రెటీలపై ఈడీ విచారణ..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మితో పాటు నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, నయని పావని, విష్ణుప్రియతో పాటు పలువురు టాలీవుడ్ హీరోయిన్లు, యాంకర్లకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లను ప్రమోట్ చేశారనే ప్రధాన అభియోగంతో 25 మంది సినీ ప్రముఖులపై ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ కేసులో ఏ1గా రానా, ఏ2గా ప్రకాష్ రాజ్, ఏ3గా విజయ్ దేవరకొండ ఉండగా ఏ4గా మంచు లక్ష్మిపై కేసు నమోదైంది. దీంతో, బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో వీరికి ఉన్న సంబంధాలు, లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


