Nagababu condemns anjanadevi health rumours: మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారంటూ ఉదయం నుంచి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యంగానే ఉన్నారనే స్పష్టత వచ్చింది. తొలుత అంజనా దేవి అనారోగ్యం గురించి వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీ నుంచి హుటాహుటాన హైదరాబాద్ చేరుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో మెగా అభిమానుల్లో కలవరం ఏర్పడింది. అంజనమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
తాజాగా మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు అంజనా దేవి ఆరోగ్యంగానే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుందని తెలిపారు. కొందరు తప్పుడు సమాచారాన్ని బయట ప్రచారం చేస్తున్నారని.. ఆమె పూర్తిగా క్షేమంగా ఉందని పేర్కొన్నారు.
మరోవైపు మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా అంజనా దేవికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో అంజనా దేవి, సురేఖ, చరణ్, ఉపాసన ఆవకాయ చేసుకుని తింటూ ఎంజాయ్ చేశారు. దీంతో ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని తేలడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో కూడా అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు వచ్చాయి.
వాస్తవంగా కేబినెట్ భేటీ నుంచి పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరడంతో అందరూ అంజనా దేవి అనారోగ్యం వార్తలు నమ్మారు. అయితే అందులోనూ వెంటనే ఈ వార్తలపై మెగా కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో ఆమె అనారోగ్యం వార్తలపై అభిమానులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు నాగబాబు ట్వీట్ చేయడం, ఉపాసన వీడియో పెట్టడంతో ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని క్లారిటీ వచ్చింది.