పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ఓ విప్లవాత్మక కథాంశంతో, భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ జరగడమంటే చిత్తశుద్ధి, పట్టుదల, భరోసా ఎంత అవసరమో చెప్పే ఉదాహరణగా మారింది. దాదాపు అయిదేళ్లుగా లైట్ మీదకి రాని ఈ సినిమా ఎన్నో మలుపులు తిరిగింది. తొలుత హైదరాబాద్లో మొదలైన షూటింగ్, రాజకీయ తీర్పుల నేపథ్యంలో వాయిదాలు, లొకేషన్ మార్పులు, మంగళగిరిలోకి సెట్స్ షిఫ్ట్, మళ్లీ మళ్లీ సెట్స్ను రెడీ చేయాల్సిన పరిస్థితులు… ఇలా పలు ఆటంకాలతో సినిమాకు సమయపాలన చాలానే కొదవైంది.
దీని ఫలితంగా బడ్జెట్ ఊహించని రీతిలో పెరిగింది. తీసుకున్న ఫైనాన్స్లపై వడ్డీలు కూడా తీవ్రంగా బాదాయి. ఇవన్నీ కలిపి నిర్మాతపై భారంగా మారాయి. ఇక్కడే పవన్ కళ్యాణ్ నిజమైన నాయకత్వాన్ని చూపించారు. ఈ సినిమాకు ఆయన ముందుగానే రూ.11 కోట్లు అడ్వాన్స్గా తీసుకున్నారు. కానీ నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకుని, తన పారితోషికం మొత్తాన్ని పూర్తిగా వెనక్కి ఇచ్చేశారని ఇండస్ట్రీలో టాక్. అంటే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేసినట్టే.
వాస్తవానికి పవన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను రోజుకు రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలిపారు. పని చేసిన రోజులను బట్టి లెక్క వెడతాం అని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ హరిహర వీరమల్లు విషయంలో మాత్రం ఆయన నైతికతను ప్రాధాన్యతగా తీసుకున్నారు. నిర్మాతకు లాభాలు వచ్చిన తరువాత అవసరమైతే తన రెమ్యునరేషన్ విషయంలో ఆలోచించమని చెప్పారట పవన్.
ప్రస్తుతం ఈ సినిమా జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్లు వేగం పెంచాయి. రాజకీయాల మధ్యన సినీ కమిట్మెంట్కి న్యాయం చేయడం, నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసిన వెంటనే పారితోషికం మాఫీ చేయడం వంటి విషయాలతో పవన్ కళ్యాణ్ గొప్ప మనిషిగా మరోసారి నిరూపించుకున్నారు. అభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇప్పుడు ఒకే మాట చెబుతున్నాయి.. పవన్ కళ్యాణ్ నటుడిగా మాత్రమే కాదు, మానవతావాదిగా కూడా రియల్ హీరో.