Rajinikanth Coolie Movie: సూపర్స్టార్ రజనీకాంత్ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 14, 2025న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కూలి ట్రైలర్ లాంంఛ్ కార్యక్రమంలో రజనీకాంత్ తన జీవితంలోని ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు.
“ఒకసారి నేను రోడ్డు మీద ఉండగా.. ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, నా లగేజ్ టెంపో వరకు తీసుకెళ్లగలవా? అని అడిగాడు. నేను సరేనని, లగేజ్ మోశాను. అతడిని గమనిస్తే, ఎక్కడో చూసినట్లు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత, అతడు నాతో కలిసి కాలేజ్లో చదువుకున్నాడని తెలిసింది. అప్పట్లో నేను అతడిని సరదాగా ఆటపట్టించేవాడిని. లగేజ్ టెంపో వద్దకు చేర్చిన తర్వాత, అతడు రూ.2 ఇచ్చి, ‘అప్పట్లో నీకు ఉన్న గర్వం ఎవరిలోనూ లేదు. ఆ రోజులు గుర్తున్నాయా?’ అని అన్నాడు. ఆ మాటలు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేని బాధాకరమైన క్షణం” అని రజనీకాంత్ భావోద్వేగంతో చెప్పారు.
‘కూలీ’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు నిజమైన హీరో లోకేశ్. అతడు ఈ చిత్రంపై అంచనాలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు. అతడితో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటీనటులతో ఒక సునామీ సృష్టించాడు. ‘ఈ కథలో పంచ్ డైలాగ్లు ఉండవు’ అని ముందే చెప్పాడు. అప్పుడే ఈ చిత్రం ఓ ఇంటెన్సిటీ డ్రామా అని అర్థమైంది” అని రజనీకాంత్ పేర్కొన్నారు.
కాగా, ‘కూలీ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ఆగస్టు 14, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.


