Allu Aravind: ఇటీవల టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తల్లి అల్లు కనకరత్నమ్మ 94 ఏళ్ల వయసులో వృద్ధాప్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో దశదినకర్మ కార్యక్రమం సోమవారమే పూర్తయింది. ఈ కార్యక్రమం ముగియగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం అనుమతి లేకుండా జూబ్లీహిల్స్ (Jubilee Hills) రోడ్ నెం.45లో బిల్డింగ్లో పెంట్ హౌస్ నిర్మించారని దానిని కూల్చివేస్తామని హెచ్చరించారు. అయితే ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులలో అధికారులు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో అల్లు అరవింద్ సుమారు 1000 గజాల విస్తీర్ణంలో ఒక బిజినెస్ పార్క్ భవనాన్ని (Business Park Building) నిర్మించారు. ఈ నిర్మాణం కోసం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు నాలుగు అంతస్తుల వరకు జీహెచ్ఎంసి అధికారుల నుంచి అనుమతులు లభించాయి. ఏడాది క్రితమే ఈ నిర్మాణం పూర్తి కావటమే కాకుండా..కమర్షియల్గానూ అందుబాటులోకి వచ్చింది.
బిజినెస్ పార్క్ భవనంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నాలుగో అంతస్తు పైన కొత్తగా ఒక పెంట్ హౌస్ నిర్మించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నిర్మాణ నిబంధనలు కఠినంగా అమలులో ఉండటంతో ఈ పెంట్ హౌస్ నిర్మాణం భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధమని అధికారులు తేల్చారు. అందుకే ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ, అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేసింది.
ఉన్నత స్థాయిలోని ప్రముఖులే ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతుంటే ఇక సాధారణ ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందుకే నగరపాలక సంస్థ ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ భవనం ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాల కోసం ఉపయోగించబడుతున్న నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసి తదుపరి చర్య ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి అల్లు అరవింద్ ఈ పెంట్ హౌస్ నిర్మాణంపై, అలాగే దీనిని ఎందుకు కూల్చివేయకూడదు అనే అంశంపై ఎప్పుడు వివరణ ఇస్తారో వేచి చూడాలి.


