Vijay Devera Konda Controversy: ఈ మధ్య టాలీవుడ్లో సెలబ్రిటీలు మాట్లాడుతున్న మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పుడు పలువురు ప్రముఖులు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్గా మారుతున్నాయి. సెలబ్రిటీలు తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా కొన్ని మాటలకు జనం నుంచి రివర్స్గా రియాక్షన్ అవుతుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. గిరిజనుల మనోభావాలను దెబ్బతించేలా ఆయన మాట్లాడారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ అంశం ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది.
వివరాల్లోకి వెళితే, గతంలో సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయ్ దేవరకొండ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ వేదిక ఆయన ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం గురించి మాట్లాడుతూ అప్పుడెప్పుడో 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకునేవాళ్లు అంటూ మాట్లాడారు. అప్పుడే గిరిజనులను విజయ్ దేవరకొండ తక్కువ చేసి మాట్లాడారంటూ వివాదానికి దారి తీశాయి. గిరిజనులను పాకిస్థాన్ తీవ్రవాదులతో పోల్చాడని, కించపరిచాడని విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ నాయక్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. నేను మాట్లాడిన మాటలు వల్ల కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలిసింది. కానీ నేనెప్పుడూ ఏ వర్గాన్ని, తెగను కించపరచను. ఆ ఉద్దేశంతో ఎప్పుడూ మాట్లాడలేదు. దేశంలోని ప్రజలందరూ ఒకటే అని నమ్మే వ్యక్తిని నేను.నేను మాట్లాడిన ట్రైబ్ అనే పదాన్ని వేరే అర్థంతో వాడాను. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడిన మాటలు వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి. నేను శాంతి, ఐక్యత గురించే మాట్లాడాను’ అన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే..అభిమానులు రౌడీ స్టార్ అని పిలుచుకునే యంగ్ హీరో విజయ్ దేవకొండ ఇప్పుడు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది. మరో వైపు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో ఆయన భాగం కాబోతున్నారు.