Bus Accident At Tandoor: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఘటన మరువకముందే ఇవాళ మరో ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ కొట్టింది. ఘటనలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
Also Read: https://teluguprabha.net/viral/drunk-man-riding-on-royal-bengal-tiger-video-is-going-viral/
నవంబర్ 4(మంగళవారం)న మధ్యాహ్నం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ సమీపంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ, బస్సు రెండూ కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినవే అని పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఆపద జరగకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం తెల్లవారుజామున మీర్జాగూడ వద్ద కంకరతో వెళ్తున్న టిప్పర్ లారీ.. ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దుర్ఘటనలో బస్సు డ్రైవర్లు ఇద్దరు సహా 19 మంది మృతి చెందారు. 72 మంది ప్రయాణికులతో వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సు.. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేట్ సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. లారీలోని కంకర మొత్తం బస్సులోకి జారడంతో.. కొందరు ప్రయాణికులు బలమైన గాయాలతో మరణించారు. మరికొందరు కంకరలో కూరుకుపోయి ఊపిరాడక విలవిల్లాడుతూ మృతి చెందారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఆరుగురు పురుషులు, 10 నెలల చిన్నారి ఉన్నారు. మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి.


