హైదరాబాద్ MMTS ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం(Attempted Rape) నిందితుడిని(Accused identified) పట్టుకున్నారు పోలీసులు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ గా గుర్తించారు.
జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది అతడేనని గుర్తించినట్లు తెలిసింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
ఏం జరిగిందంటే..?
ఎంఎంటీఎస్ రైలులో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఒక యువతిపై ఒక యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి రైలు నుంచి దూకడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
మేడ్చల్లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువతి తన సెల్ ఫోన్ రిపేరు కోసం సికింద్రాబాద్ వెళ్లి, పని ముగిసిన తర్వాత తిరిగి ఎంఎంటీఎస్లో బయలుదేరింది. ఆమె మహిళా కోచ్లో ప్రయాణిస్తుండగా, ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. ఆ తర్వాత బోగీలో ఒంటరిగా ఉన్న ఆమెపై ఒక యువకుడు (25) అత్యాచారయత్నం చేయబోయాడు.
దీంతో ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు కొంపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద రైలు నుంచి దూకింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుడిని గుర్తించారు.