Lecturer sexual harrasment: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బెంగళూరులోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగింది. నిందితుడిని 45 ఏళ్ల సంజీవ్ కుమార్ మండల్గా గుర్తించారు, ఇతను అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. బాధిత విద్యార్థిని 19 ఏళ్ల బీసీఏ మూడవ సంవత్సరం చదువుతోంది.
భోజనానికి పిలిచి:
సెప్టెంబర్ 25న, ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ మండల్ విద్యార్థినిని భోజనం కోసం తన జయనగర్లోని ఇంటికి ఆహ్వానించాడు. తన భార్య మరియు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారని, అందరం కలిసి భోజనం చేద్దామని విద్యార్థినిని, ఆమె తల్లిని నమ్మించాడు. గురువు మాట కావడంతో, విద్యార్థిని తల్లి కూడా కుమార్తెను వెళ్లమని సూచించారు. అయితే, విద్యార్థిని ఇంటికి చేరుకున్నప్పుడు, అక్కడ ప్రొఫెసర్ ఒంటరిగా ఉన్నాడని గుర్తించింది. దీంతో ఆమె అసౌకర్యానికి గురైంది.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, నిందితుడు ఆమె పక్కన సోఫాలో కూర్చుని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత, మార్కులు, హాజరు (Attendance), డబ్బు విషయంలో సహాయం చేస్తానని ఆశ చూపాడు. అంతేకాకుండా, ఆమెను తన బాయ్ఫ్రెండ్తో విడిపోవాలని మరియు సందేహాలు నివృత్తి చేసుకోవడానికి తరచుగా తన ఇంటికి రావడానికి వీలుగా తన అపార్ట్మెంట్ పక్కనే ఉన్న పీజీకి మకాం మార్చాలని కూడా అడిగాడు. విద్యార్థిని అభ్యంతరం చెప్పినప్పటికీ, అతను ఆమెను అనుచితంగా తాకడం ప్రారంభించాడు.
ఈ వేధింపులతో షాక్కు గురైన విద్యార్థిని, వెంటనే తన మొబైల్కు వచ్చిన స్నేహితురాలి కాల్ను అత్యవసరంగా వచ్చినట్లుగా చెప్పి, అక్కడి నుంచి బయటకు పరుగెత్తింది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, కేవలం తాను ఆమె విశ్వసనీయతను పరీక్షిస్తున్నానని లెక్చరర్ చెప్పినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది.
విద్యార్థిని తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు తిలక్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు లెక్చరర్ సంజీవ్ కుమార్ మండల్ను అరెస్టు చేశారు. అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. అయితే, ఆ తర్వాత అతనికి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. యూనివర్సిటీ యాజమాన్యానికి ఈ విషయం గురించి తెలియదని, పోలీసుల చర్య కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.


