Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: ప్రీతిని పరామర్శించిన ఎర్రబెల్లి

Hyd: ప్రీతిని పరామర్శించిన ఎర్రబెల్లి

పీజీ వైద్య విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్ని తండాకు చెందిన పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగయిన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు వరంగల్ సీపీ రంగనాథ్ తో మాట్లాడి ఈ ఘటన పై తాజా పరిస్థితి ని తెలుసుకున్నారు. ఇంకోవైపు ప్రీతి తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వ్యక్తిగతంగా తను, ప్రభుత్వం అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

- Advertisement -

ప్రీతికి మంచి వైద్యం అందిస్తున్నాం అన్నారు. అలాగే ప్రీతి తల్లి దండ్రులు శారద, (రైల్వే లో ఏ ఎస్ ఐ) దరావత్ నరేందర్ నాయక్ లతో, వైద్యులను కలిపి ప్రత్యేకంగా మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ఉన్న సందేహాలను నిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్, ఇతర వైద్యులతో మాట్లాడించి నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా తో మాట్లాడుతూ…”ఈ ఘటన అత్యంత బాధాకరమైనదన్నారు. ప్రీతి కుటుంబం నా పాలకుర్తి నియోజవర్గం కు చెందినది. చాలా కాలంగా ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. సంప్రదాయ పద్ధతిలో ఉండే ఫ్యామిలీ. ప్రీతి నిప్పులాంటి అమ్మాయి. ఆమెను వేధించిన వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చి తిప్పి కొట్టింది. వేధింపుల వల్లే మానసిక వేదనకు గురైనట్లుగా అనిపిస్తున్నది. పోలీస్ విచారణ జరుగుతున్నది. దోషులు తేలితే, ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదు. చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తాం. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించార”ని మంత్రి చెప్పారు.
“కొందరు అతి సున్నితమైన ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబానికి అండగా నిలవాలి. ప్రీతి బతకాలి. న్యాయం జరగాలి. దోషులకు శిక్ష పడాల”ని ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని మంత్రి వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News