Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుGuntur Crime : ఇన్ స్టాగ్రామ్ లవ్.. ఆ తర్వాత సహజీవనం.. పెళ్లికి నిరాకరించడంతో..

Guntur Crime : ఇన్ స్టాగ్రామ్ లవ్.. ఆ తర్వాత సహజీవనం.. పెళ్లికి నిరాకరించడంతో..

ఇటీవల కాలంలో సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఆన్లైన్ పరిచయాలు అంతటితో ఆగకుండా.. ప్రేమ, సహజీవనం,పెళ్లి వరకూ వెళ్తున్నాయి. అంతా బాగుంటే ఓకే. లేదంటే చంపడానిక్కూడా వెనుకాడట్లేదు. ఇన్ స్టా గ్రామ్ పరిచయం ఓ యువతి ప్రాణాలను హరించింది. పరిచయం స్నేహమై, స్నేహం ప్రేమై.. సహజీవనం వరకూ దారితీసింది. ఆ తర్వాత తలెత్తిన విభేదాలు ఆ యువతి నిండు ప్రాణాల్ని బలితీసుకున్నాయి. తనను కాదని మరో యువకుడిని ఆమె పెళ్లాడుతుందని తెలిసి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సర్జికల్ బ్లేడ్ తో ఆమె గొంతుకోసి హతమార్చాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వికి, అదే జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. తపస్వి విజయవాడలో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతుండగా.. జ్ఞానేశ్వర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ప్రేమ మైకంలో, మోజులో వీరిద్దరూ రెండేళ్లపాటు గన్నవరంలో కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో జ్ఞానేశ్వర్‌ కు దూరంగా ఉంది తపస్వి. కానీ అతని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దాంతో తపస్వి జ్ఞానేశ్వర్‌ పై కృష్ణా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో.. తక్కెళ్లపాడులో ఉంటున్నతన స్నేహితురాలికి విషయం చెప్పుకుని బాధపడింది తపస్వి. అంతా తెలుసుకున్న ఆమె.. తపస్వి – జ్ఞానేశ్వర్‌ ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తన ఇంటికి రమ్మని పిలిపించింది. నిన్న(డిసెంబర్ 5)రాత్రి 9 గంటల సమయంలో ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటుండగా.. జ్ఞానేశ్వర్‌ తపస్విపై దాడి చేశాడు. ఆ ఇంటి యజమానికి ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. తపస్వి స్నేహితురాలు భయంతో కేకలు వేస్తూ.. పరుగు పరుగున ఇంటి యజమాని వద్దకు వచ్చి.. అతడిని పైకి తీసుకెళ్లింది.

కానీ.. అప్పటికే అతడు తలుపులు బిగించి బాధితురాలి గొంతు కోసేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి.. నిందితుడిని బంధించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తపస్విని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నేరం జరిగిన ప్రదేశానికి, ప్రేమికులకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. తపస్వి, తన స్నేహితురాలు, నిందితుడు మాట్లాడుతుండగా.. మధ్యలో తాను వేరే యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పడంతో నిందితుడు కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆపై అతను కూడా బ్లేడుతో చేతిపై కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News