Nalgonda Minor girl murder case: నల్గొండలో జరిగిన మైనర్ బాలిక హత్యాచారం కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుని వెలువరించింది.
వివరాల్లోకి వెళ్తే, 2013లో నల్గొండకు చెందిన మహ్మద్ ముకర్రం అనే వ్యక్తి ఒక 12 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. అదే అదునుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే ఇబ్బంది అవుతుందని భావించి, ఆ బాలికను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో పడేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నల్గొండ వన్టౌన్ పోలీసులు నిందితుడు ముకర్రంను అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టంతో పాటు హత్యా నేరం కింద కేసు పెట్టారు. గత పదేళ్లుగా ఈ కేసు విచారణ జిల్లా కోర్టులో కొనసాగుతోంది. ఈ రోజు, పోక్సో కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఉరిశిక్షతో పాటుగా రూ. 1.10 లక్షల జరిమానా కూడా విధించారు. ఈ తీర్పును ప్రజలు స్వాగతిస్తున్నారు.


