Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుMumbai Crime : కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరితే.. స్లో పాయిజన్ హత్యగా తేల్చిన వైద్యులు.. ఎలా...

Mumbai Crime : కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరితే.. స్లో పాయిజన్ హత్యగా తేల్చిన వైద్యులు.. ఎలా జరిగిందంటే..

ముంబైలో ఓ వ్యక్తి కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరగా.. ఆఖరికి కన్నుమూశాడు. ఈ ఘటన అందరినీ షాకయ్యేలా చేసింది. అది సహజమరణం కాదు. హత్య అని తెలిసిన బంధువులు నిర్ఘాంతపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శాంతాక్రజ్‌కు చెందిన కవిత-కమల్‌కాంత్ భార్యాభర్తలు. తన భర్తతో విభేదాల కారణంగా కవిత అతనికి దూరంగా వెళ్లిపోయింది. పిల్లల భవిష్యత్ కోసం మళ్లీ భర్తతో కలిసి ఉండాలని తిరిగి వచ్చింది. కమల్‌కాంత్, హితేశ్ జైన్ చిన్ననాటి నుండి స్నేహితులు. ఇద్దరూ వ్యాపార కుటుంబాల నుండి వచ్చినవారే.

- Advertisement -

ఒక రోజు కమల్ కాంత్ తల్లి అకస్మాత్తుగా కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందింది. కొన్నాళ్లకు కమల్ కాంత్ కూడా కడుపునొప్పితో బాధపడ్డాడు. ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. దీంతో ఆసుపత్రికి వెళ్లిన అతడిని పరీక్షించిన వైద్యులు అతడి రక్తంలో ఆర్సెనిక్, థాలియం స్థాయులు అధికంగా ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. మానవ శరీరంలో ఈ లోహాలు చేరడం అసాధారణమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కమల్ కాంత్ నవంబర్ 19న మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తొలుత అకస్మాత్ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో కమల్ భార్య కవితపై అనుమానం వచ్చింది. దాంతో ఇందులో ఏదో కుట్ర ఉన్నట్లు భావించి కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కవిత, కమల్‌కాంత్ బాల్య స్నేహితుడు హితేశ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..వాళ్లు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. బాధితుడి మెడికల్ రిపోర్టు, బాధితుడి భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలంతోపాటు కమల్‌కాంత్ తీసుకునే ఆహారం గురించి సేకరించిన విషయాలు కుట్రను బయటపెట్టినట్టు పోలీసులు తెలిపారు.

భర్తతో వివాదం తర్వాత.. తిరిగి కాపురానికి వచ్చిన కవిత హితేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి కమల్ అడ్డుగా ఉన్నాడని భావించింది. ఒక్కసారిగా అతను చనిపోతే అందరికీ అనుమానం వస్తుందని.. ప్రియుడితో కలిసి భర్త తినే ఆహారంలో కొద్దికొద్దిగా విషం కలుపుతూ వచ్చింది. అది నెమ్మదిగా అతడి మృతికి కారణమైంది. కమల్ కాంత్ తల్లి కూడా కడుపు నొప్పితో బాధపడి మృతి చెందడంతో ఆమెకు కూడా స్లోపాయిజన్ ఇచ్చి చంపేసి ఉంటారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కవిత, హితేశ్‌లకు కోర్టు ఈ నెల 8 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News