Wife kills husband with lover : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హతమార్చిందో ఇల్లాలు. ప్రియుడితో కలిసి పక్కా పథకం ప్రకారం ప్రాణాలు తీసి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ, చట్టం కళ్లనుగప్పి ఎక్కువ కాలం దాగలేకపోయింది. నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ హత్య కేసు వివరాలు, మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో కళ్లకు కడుతున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా, శ్రీపురం గ్రామానికి చెందిన రాములు (35), భార్య మానస (35), ముగ్గురు పిల్లలతో కలిసి ప్లంబర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాగర్కర్నూల్ డీఎస్పీ బి. శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంత్రగాడితో పరిచయం.. వివాహేతర సంబంధం: ఆరు నెలల క్రితం ఇంట్లో నగలు దొంగతనం జరగడంతో, దొంగలెవరో తెలుసుకోవడానికి మానస, పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన మంత్రగాడు సురేష్ గౌడ్ (27) వద్దకు వెళ్లింది. ఆ పరిచయం, వివాహేతర సంబంధానికి దారితీసింది.
భర్తకు అనుమానం.. హత్యకు ప్లాన్: ఈ విషయంపై భర్త రాములుకు అనుమానం వచ్చి, భార్యను నిలదీయడంతో గొడవలు మొదలయ్యాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని మానస, ప్రియుడు సురేష్తో కలిసి కుట్ర పన్నింది.
పక్కా ప్లాన్తో పాశవికం : ఈ నెల 8న, ఇంట్లో పెళ్లి ఉందని పుట్టింటికి వెళ్తున్నట్లు భర్తను నమ్మించిన మానస, ప్రియుడికి భర్త హత్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సుపారీ హత్య: సురేష్ గౌడ్, ఈ హత్య కోసం తన వద్ద పనిచేసే బాల్ పీరు, హనుమంతులకు రూ.2.80 లక్షల సుపారీ ఇచ్చాడు. పథకం ప్రకారం, రాములును పెద్దముద్దునూరుకు పిలిపించి, ముగ్గురూ కలిసి అతనికి బలవంతంగా మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న రాములు ముక్కుకు, నోటికి ప్లాస్టర్ టేపును గట్టిగా చుట్టి, ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం, మృతదేహాన్ని రోడ్డుపై పడేసి, వాహనం ఢీకొట్టినట్లు గాయాలు చేసి, రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు.
తండ్రి అనుమానంతో వీడిన మిస్టరీ : రోడ్డుపై పడి ఉన్న రాములు మృతదేహాన్ని చూసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందగా, ఘటనా స్థలానికి చేరుకున్న రాములు తండ్రికి అనుమానం వచ్చింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
పోస్టుమార్టం రిపోర్ట్: పోస్టుమార్టం నివేదికలో, రాములు ఊపిరాడక చనిపోయాడని తేలడంతో, ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు.
నిందితుల అంగీకారం: మానస, సురేష్లపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు. ఈ హత్య కేసులో మానస, ఆమె ప్రియుడు సురేష్ గౌడ్తో పాటు, సుపారీ తీసుకున్న బాల్ పీరు, హనుమంతులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.


