Darshan : కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి (33) హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్రా గౌడలకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో వారి బెయిల్ను రద్దు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే బెంగళూరు పోలీసులు పవిత్రా గౌడను ఆమె ఆర్ఆర్ నగర్ నివాసంలో, దర్శన్ను హొసకెరెహళ్లిలోని అతని భార్య ఇంటిలో అరెస్టు చేశారు. దర్శన్ మీడియాను తప్పించేందుకు ఎగ్జిట్ గేట్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించినప్పటికీ, పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.
ALSO READ: Cloud Burst: ఘోర విపత్తు.. 12 మంది భక్తులు మృతి
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి, దర్శన్ అభిమాని, పవిత్రా గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో 2024 జూన్ 8న రేణుకాస్వామిని బెంగళూరులోని ఓ షెడ్లో బంధించి, చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. జూన్ 9న అతని మృతదేహం సుమనహళ్లిలోని ఓ డ్రైన్ సమీపంలో కనిపించింది. దర్శన్, పవిత్రా సహా 17 మందిపై 3,991 పేజీల చార్జ్షీట్ దాఖలైంది. పవిత్రా ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా, దర్శన్ రెండో నిందితుడిగా ఉన్నారు.
సుప్రీంకోర్టు ఈ కేసులో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తీరును “పర్వర్స్”గా విమర్శించింది. నిందితులు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, విచారణను త్వరగతిన చేపట్టాలని ఆదేశించింది. జైలులో నిందితులకు “ఫైవ్-స్టార్” సౌకర్యాలు కల్పిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటన కర్ణాటకలో రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


