Tribal Development In Telangana: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా కొన్ని మారుమూల పల్లెల తలరాతలు మాత్రం మారడం లేదు. అభివృద్ధి ఫలాలు వారికి అందడం లేదు, కనీస మౌలిక సదుపాయాలకు వారు నోచుకోవడం లేదు. రోడ్డు సౌకర్యం లేక అనారోగ్యం పాలైతే డోలీలే వారికి అంబులెన్సులు, చివరికి మరణించినా మంచమే పాడెగా మారుతున్న హృదయ విదారక దృశ్యాలు ఆధునిక సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో చోటుచేసుకున్న ఈ ఘటనే ఇందుకు నిలువుటద్దం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, అశ్వాపురంపాడు అనే మారుమూల వలస గిరిజన గ్రామానికి చెందిన నందమ్మ అనే మహిళ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం సాయంత్రం మృతి చెందింది.
ALSO READ: https://teluguprabha.net/crime-news/rs-100-crore-gst-evasion-fraud-comes-to-light-in-telangana/
నందమ్మ మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడం వారికి పెను సవాలుగా మారింది. వారి గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో చేసేది లేక, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు కలిసి ఒక మంచాన్ని పాడెగా మార్చారు (దీనిని స్థానికంగా ‘జట్టి కట్టడం’ అంటారు). ఆ మంచంపై నందమ్మ మృతదేహాన్ని ఉంచి, చిమ్మ చీకట్లో, కాలిబాటన సుమారు మూడు కిలోమీటర్లు మోసుకెళ్లారు.అలా వారు ప్రధాన రహదారి నుంచి తమ గ్రామానికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిది గంటలు దాటింది. ఆ రాత్రికి మృతదేహాన్ని ఇంట్లో ఉంచి, మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు.
మారని గిరిజనుల తలరాతలు
ఈ ఘటన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల దుర్భర జీవితాలకు అద్దం పడుతోంది. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా, వలస వచ్చి ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామాలకు కనీసం ఒక రోడ్డు కూడా లేకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ బతుకులు మారడం లేదని వారు వాపోతున్నారు. అత్యవసర వైద్యం కోసం, చివరికి అంతిమయాత్రకు కూడా నోచుకోని తమ దుస్థితిని ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకుని, తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని వారు వేడుకుంటున్నారు.


