Tragedy in Delhi during the festival day: రక్షా బంధన్ పండుగ రోజున ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ దుర్ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని జైత్పూర్లోని హరి నగర్ ప్రాంతంలో శనివారం సంభవించింది. పాత ఆలయానికి ఆనుకుని ఉన్న ఓ గోడ కూలిపోవడంతో అక్కడి మురికివాడల్లో నివసించే స్క్రాప్ విక్రేతలు శిథిలాల కింద చిక్కుకున్నారు.
గాయపడిన వారిని వెంటనే సఫ్దర్జంగ్ ఆసుపత్రి, ఎయిమ్స్కు తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించారు. మృతులను షబీబుల్, రబీబుల్, ముత్తు అలీ, రుబీనా, డాలీ, హషిబుల్, రుక్సానా (6), హసీనా (7)గా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన సీనియర్ పోలీసు అధికారి ఐశ్వర్య శర్మ, ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఆ మురికివాడలను ఖాళీ చేయించినట్లు తెలిపారు.
ఢిల్లీలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. భారత వాతావరణ శాఖ (IMD) ఆ రోజు ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక అండర్ పాస్లు, రోడ్లపై నీరు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడి, సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం, శనివారం ఉదయం 8.30 గంటల వరకు ఢిల్లీలో 24 గంటల్లో సఫ్దర్జంగ్ ప్రాథమిక వాతావరణ కేంద్రంలో 78.7 మి.మీ, ప్రగతి మైదాన్లో 100 మి.మీ వర్షపాతం నమోదైంది.


