Spying for Pakistan’s ISI: పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉండి, దేశ రహస్యాలను వారికి చేరవేస్తున్నారనే ఆరోపణలపై హర్యానా రాష్ట్రం, పాల్వాల్ జిల్లాకు చెందిన యూట్యూబర్ వసీం అక్రమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేవాత్ చరిత్రపై యూట్యూబ్లో వీడియోలు చేసే వసీం అక్రమ్, గత మూడు సంవత్సరాలుగా పాకిస్తాన్ ఏజెంట్లతో టచ్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన అక్రమ్ను బుధవారం అరెస్ట్ చేశారు. ఇతను పాక్ ఏజెంట్లకు సిమ్ కార్డులను కూడా సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ్ వాట్సాప్ చాట్లను పరిశీలించగా, అనేక నేరపూరిత సందేశాలను గుర్తించారు. కొన్ని సందేశాలను తొలగించగా, వాటిని తిరిగి పొందడానికి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్కు అతని ఫోన్ను పంపించారు.
పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలపై గత వారం పాల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసిన తౌఫిక్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా వసీం అక్రమ్ను అదుపులోకి తీసుకున్నారు. 2021లో అక్రమ్ పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ దానిష్తో పరిచయం ఏర్పడిందని దర్యాప్తులో తేలింది. అక్రమ్ మరియు తౌఫిక్ ఇద్దరూ ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఐఎస్ఐ మరియు పాకిస్తాన్ హైకమిషన్తో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అక్రమ్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో సున్నితమైన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడమే కాకుండా సిమ్ కార్డును కూడా సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును పాల్వాల్ క్రైమ్ బ్రాంచ్ పూర్తిగా దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ఇదే తరహా ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వసీం, తౌఫిక్లు కేవలం లాజిస్టికల్ సహాయం మాత్రమే కాకుండా, భారత సైన్యానికి సంబంధించిన సిబ్బంది గురించిన సున్నితమైన సమాచారాన్ని కూడా పాకిస్తాన్ హ్యాండ్లర్లతో పంచుకున్నారు.
తౌఫిక్ 2022 నుండి పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని పంపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతను ఇచ్చిన సమాచారంతోనే వసీం అక్రమ్ను అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా, తొలగించిన చాట్ల ద్వారా వారు పాకిస్తానీ కార్యకర్తలతో ఏ సున్నితమైన వివరాలు పంచుకున్నారో తెలుసుకోవడానికి సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు కృషి చేస్తున్నారు.


