Friday, September 20, 2024
HomeదైవంSashti Bonalu: షష్టి పూజ, షష్టి బోనాలకు వేళాయె

Sashti Bonalu: షష్టి పూజ, షష్టి బోనాలకు వేళాయె

దొంగ మల్లన్న, షష్ఠి మల్లన్న అని ఎందుకంటారో తెలుసా?

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామం మల్లన్నపేటలో శ్రీ మల్లికార్జున స్వామి ‘దొంగ మల్లన్న’గా, ‘షష్టి మల్లన్న’గా భక్తుల నిత్యపూజలు అందుకుంటున్నారు. వారి కోర్కెలు తీర్చే స్వామిగా ఆయనకు పేరుంది. ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమి మొదలు షష్టి 7 వారాల పాటు పూజలందుకుంటారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ఉత్తరాన 62 కి.మీ. దూరంలో, జగిత్యాల జిల్లాకు తూర్పున 12 కి.మీ. దూరాన మల్లన్నపేటలో ఈ ఆలయం ఉంది. ​ఈ స్వామివారిని గొల్ల, కుర్మ కులస్తులు ఆరాధిస్తారు.
​ఆలయ నేపథ్యం ఇదీ..
​కొన్నేళ్ల క్రితం దొంగలు పొలాస పాలకులకు చెందిన కొన్ని ఆవులను దొంగిలించారు. వీరు వస్తుండగా దారిలో ఓ వ్యక్తి చూసి, ఇవి రాజుగారి ఆవులని గుర్తించాడు. దొంగలు తాము దొరికిపోతామన్న భయంతో మల్లికార్జునస్వామి విగ్రహం వద్దకు వెళ్లి, ఆవుల రంగుల మార్చి, గుర్తు పట్టకుండా చేస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు. అనుకున్నది నెరవేరడంతో స్వామివారికి రాత్రికి రాత్రే గుడి కట్టారనే నానుడి. ఈ కారణంగా ఆలయాన్ని ‘దొంగ మల్లన్న’ ఆలయమని పిలుస్తున్నారు. మార్గశిర శుద్ధ పంచమి తర్వాత వచ్చే షష్టికి ప్రారంభం కావడంతో ‘షష్టి మల్లన్న జాతర’ అని కూడా పిలుస్తారు.
బోనం తీయడం ఆనవాయితీ
​ఆలయం ఎదుట మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం, దండివారం జాతర, నాగవెల్లితో ప్రారంభమై మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజుతో షష్టి 7 వారాలపాటు జాతర సాగుతుంది. స్వామివారికి ఇష్టమైన ఆది, బుధవారాల్లో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. జాతరకు వచ్చిన ప్రతీ కుటుంబం బోనం తీయడం ఆనవాయితీ. కోరిన కోర్కెలు తీరితే తమ బరువెత్తు బెల్లం (బంగారం) పంచడం, తలనీలాలు ఇవ్వడం, స్వామి వారికి ఒడి బియ్యం, బంగారం, వెండి కానుకలు సమర్పించడం, గండాదీపంలో నూనె పోయడం, ఆలయ మండపంలో గంటలు కట్టడం, గోసేవ చేయడం, తదితర రకాల్లో మొక్కు చెల్లించుకుంటారు.
తేదీలు.. కార్యక్రమాలు
​ఈ నెల 17న రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం, 18న(ఆదివారం) దండివారం, 20న మంగళవారం నాగవెల్లి, పెద్దపట్నం, అగ్ని గుండాలు, 20 నుంచి ప్రతీ ఆది, బుధవారాల్లో జాతర జరుగుతుంది. చివరి రోజు జనవరి 11న (గురువారం) మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండీహవనం, పూర్ణాహుతితో ముగుస్తుంది.

- Advertisement -

ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తులకు జగిత్యాల పాత బస్టాండ్‌ నుంచి ప్రత్యేక బస్సుల సౌకర్యం ఉందని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎం విక్రమ్, ఆలయ ట్రస్టీ పౌండర్ కొండూరి శాంతయ్య, సర్పంచ్‌ సిద్దంకి నర్సయ్య, ఎంపీటీసీ సభ్యుడు గోస్కుల రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News