Significance of Puri Rath Yatra 2025: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుడు రథయాత్ర జూన్ 27న అంటే ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభం కానుంది. ఈ యాత్రకు దేశనలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఇందులో జగన్నాథుడి రూపంలో ఉన్న వాసుదేవుడు(కృష్ణుడు) రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, చెల్లెలు సుభద్ర రథాలు కూడా పాల్గొంటాయి. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈసారి ఈయాత్రకు 15 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో 10,000 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఇప్పటికే మోహరించారు.
స్వామివారి రథయాత్రకు రెండు నెలల ముందుగానే అంటే వైశాఖ బహుళ విదియ నాడు పనులు మెుదలుపెడతారు. ఈ అరవై రోజుల్లోనే కలప తెచ్చి రథాల్ని సిద్ధం చేస్తారు. జగన్నాథుడి రథం పేరు నందిఘోష. ఇది 16 చక్రాలతో 46 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రథానికి సారథిగా దారుకడు వ్యహారిస్తాడు. ఇదే మూడు రథాల్లో ఎత్తెనది. బలరాముడు రథం పేరు తాళధ్వజ. 14 చక్రాలతో 45 అడుగుల ఎత్తు ఉంటుంది. సుభద్రాదేవి రథం పేరు దేవదళన. ఇది 12 చక్రాలతో 42 అడుగుల ఎత్తు ఉంటుంది.
ముందుగా జగన్నాథుడు ఆలయం నుంచి బయలుదేరి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్తాడు. అయితే స్వామివారినీ రథంపై కూర్చోబెట్టే ఉత్సవాన్ని ‘పహండీ’ అని అంటారు. పరమాత్ముడు విగ్రహాన్ని రథంలో పెట్టడానికి కంటే ముందు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తారు. దీనినే ‘చెరా పహారా’ అని పిలుస్తారు. ప్రధాన ఆలయం నుంచి గుండిచా మందిరం చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. ఒక రోజు యాత్ర తర్వాత స్వామీవారు అక్కడ ఏడు రోజులపాటు ఉంటారు.
తొమ్మిదో రోజు అంటే దశమినాడు అక్కడ నుంచి తిరుగు ప్రయాణం చేస్తారు. దీనినే ‘బహుదాయాత్ర’ అని పిలుస్తారు. జగన్నాథుడు ఈ యాత్రలో ‘అర్థాసని(మౌసీ మా)’ గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసాదాల్ని ఆరగిస్తారు. మధ్యాహ్నానికి మూడు రథాలు ప్రధాన ఆలయానికి చేరుకుంటాయి. తర్వాత రోజు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. దీనినే ‘సునాభేష’ అంటారు. ద్వాదశి నాడు ముగ్గురూ ప్రధాన ఆలయంలో తిరిగి ప్రవేశిస్తారు. దీనినే ‘’నీలాద్రి బిజే’ గా వ్యవహారిస్తారు. పూరీ జగన్నాథుడి ఆలయాన్ని నగరశైలిలో నిర్మించారు. దీన్ని మెుదట ఇంద్రద్యుమ్నుడనే రాజు నిర్మించాడని, ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 11-12 శతాబ్దాల్లో కళింగ రాజు అనంతవర్మ చోడగాంగ అనే రాజు కట్టాడని చెబుతారు. గర్భాలయంలో కొలువైన అసంపూర్తిగా ఉన్న దారు (కొయ్య) విగ్రహాలను దేవశిల్పి విశ్వకర్మ చెక్కేడని నమ్ముతారు.