Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్BBC a weapon on BJP: బీజేపీపై బీబీసీ అస్త్రం

BBC a weapon on BJP: బీజేపీపై బీబీసీ అస్త్రం

ఈ ఏడాది దేశంలోని తొమ్మిది రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది మే నెలలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రత్యర్థులు కేంద్రంలోని పాలక పక్షం మీద దాడి చేయడానికి అస్త్రశస్త్రాలన్నిటినీ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో మీడియా రంగం కూడా కొన్ని ప్రత్యేక, వినూత్న అస్త్రాలను సిద్ధం చేసుకోవడమనేది ఈ మారిన కాలంలో అత్యంత సహజం. ఏ మీడియాకైనా ఎన్నికల సమయమే మంచి సమయం. దేశం లోని కొన్ని ప్రధాన పత్రికలు, సమాచార సాధనాలు, ఛానల్స్‌ వగైరాలు పాలక పక్షం వైపు, ప్రతిపక్షాల వైపు మోహరిస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కూడా అటు రాజకీయ రంగంలో, ఇటు ప్రజల్లో ఇదే విధమైన ఆలోచనలు రేకెత్తుతున్నాయి. 2002 నాటి గుజరాత్‌ అల్లర్లపై బ్రిటిష్‌ బ్రాడ్కా స్టింగ్‌ కార్పొరేషన్‌ రూపొందించిన ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన మొదటి భాగాన్ని గత 17న ప్రసారం చేయడం జరిగింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యు మెంటరీని ప్రసారం చేయడంపై నిషేధం విధించడంతో అది ప్రస్తుతానికి ఆగిందనే చెప్పాలి. ఈ రెండు భాగాల డాక్యుమెంటరీకి ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ అని పేరు పెట్టడం జరిగింది.
మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ జరిగిన మతపరమైన అల్లర్లు, వాటిపై మోదీ ప్రభు త్వ స్పందన ప్రధానాంశంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించడం జరిగింది. ఈ డాక్యుమెంటరీలో ఏముందో తెలియదు కానీ, దీన్ని చూసినవారు మాత్రం ఇది ఏక పక్షంగా ఉందనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక రకమైన ప్రచారం అని, నిష్పాక్షికత లోపించిందని, వలసవాద దృక్పథంతో రూపొందించడం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్లో జరిగిన అల్లర్ల విషయలో అప్పటి మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరించిందని బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఇమ్రాన్‌ హుసేన్‌ విమర్శించారు. అయితే, బ్రిటన్‌ ప్రధానమంత్రి రుషి సునాక్‌ ఈ అభిప్రాయాన్ని తీవ్రంగా ఖండించారు. తాను ఇమ్రాన్‌ హుసేన్‌తో ఏకీభవించలేనని ఆయన అన్నారు. ఇమ్రాన్‌ హుసేన్‌ పాకిస్థాన్‌ సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్టు ఉండిపోయిందనే అభిప్రాయం సరైనది కాదని ఆయన వ్యాఖ్యానించారు. మోదీని చిత్రీకరించిన విధానం సరైనది కాదని సునాక్‌ అన్నారు. కాగా, ఇమ్రాన్‌ మాత్రం గుజరాత్‌ అల్లర్ల సందర్భంగా ఒక వర్గాన్ని పూర్తిగా తుడిచి పెట్టడానికి కుట్ర జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నా మోదీ ఏమాత్రం పట్టించుకోకపోవ డం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
పూర్తిగా ఏకపక్షం
విచిత్రమేమిటంటే, గుజరాత్‌ అల్లర్ల గురించి రచ్చ చేస్తున్నవారు ఈ అల్లర్లకు దారితీసిన పరిస్థితుల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదని బీజేపీ సీనియర్‌ నాయకుడు రాజేశ్‌ సక్సేనా అహ్మదాబాద్‌లో విలేఖరుల సమావేశంలో విమర్శించారు. సబర్మతి రైలు దుర్ఘటన గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు ఈ రైలు మీద దాడి చేసి ఉద్దేశపూర్వకంగా తమ వారిని మట్టుబెట్టేందుకు పథకం పన్నారని ఆయన గుర్తు చేశారు. రైలు బోగీలకు నిప్పంటించడంతో డెబ్బయ్‌ మందికి పైగా సజీవ దహనమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సంఘటనకు ప్రతీకారంగానే గోధ్రా అల్లర్లు జరిగిన విషయాన్ని మరచిపోరాదని కూడా ఆయన అన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ కూడా ఈ వాస్తవాన్ని చాలావరకు విస్మరించిందని గుజరాత్‌కు చెందిన పార్టీ నాయకులు కొందరు విమర్శించారు.
రుషి సునాక్‌ పార్లమెంట్లోనే ఒక ప్రకటన చేస్తూ, ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకూ బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరి, విధానం సుస్పష్టం. మారణ హెూమాలను ప్రోత్సహించడం మా అభిమతం కాదు. అయినప్పటికీ ఈ సంస్థ గుజరాత్‌ అల్లర్లను చిత్రీకరించిన విధానం, మోదీని దోషిగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం ఏకపక్షంగా ఉందని మాత్రమే చెబుతున్నాం అని స్పష్టం చేశారు. బ్రిటిష్‌ పౌరులలో కూడా ఎక్కువ మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అర్విందం బాగ్చీ ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ డాక్యుమెంటరీని ఇంతవరకూ భారత్‌లో ప్రసారం చేయడం జరగలేదని చెప్పారు. తనకు పలువురు చెప్పిన విషయాలు, తన దృష్టికి వచ్చిన విషయాల ఆధారంగా మాత్రమే తాను వ్యాఖ్యానిస్తున్నానని కూడా ఆయన అన్నారు. అయితే, ఇది కొందరి మీద బురద చల్లడానికి ఉద్దేశించిన ప్రచార కార్యక్రమమని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ డాక్యుమెంటరీని నిర్మించడంలో నిష్పాక్షికత లోపించిందని, కేవలం బ్రిటిష్‌ వలసవాదుల దృక్పథానికి అద్దంపడుతోందని ఆయన విమర్శించారు. ఈ డాక్యుమెంటరీ నిర్మాణాన్ని బట్టి ఈ సంస్థ ఉద్దేశాలేమిటో, ఏ కారణంగా దీనిని నిర్మించడం జరిగిందో, వీరి లక్ష్యం ఏమిటో తేలికగా అర్థమైపోతూనే ఉందని మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్‌ బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ డాక్యుమెంటరీలో అప్పటి హింసా విధ్వంస కాండలకు సంబంధించిన వీడియోలను చొప్పించారు. ఈ హింసాకాండలో ముగ్గురు బ్రిటీష్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర మాజీ మంత్రి హరేన్‌ పాండ్యాను హత్య చేసినట్టు కూడా చూపించారు. అంతేకాక, 2001, 2006 సంవత్సరాల మధ్య భారత్లో విదేశాంగ మంత్రిగా పని చేసిన జాక్‌ స్ట్రాను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఈ హింసాకాండ తర్వాత బ్రిటన్‌ ప్రభుత్వం ఈ సంఘటనలపై దర్యాప్తుకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు గుజరాత్‌ వచ్చి దర్యాప్తు కూడా జరిపారు. ఈ కమిటీ ఈ అల్లర్లపై లోతుగా అధ్యయనం జరిపి ఒక సమగ్ర నివేదికను అంద జేసిందని, దాని ప్రకారం ఇక్కడ అల్లర్లు జరుగుతున్నప్పుడు మోదీ ప్రభుత్వం చూసీచూడనట్లు ఊరుక ఎందనే విషయం తేటతెల్లమయిందని స్ట్రా ఈ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా ఇక్కడ హింసాకాండ ప్రారంభమైనందనడంలో ఎటువంటి సందేహమూ లేదని కూడా ఆయన పేర్కొన్నారు.
బ్రిటిష్‌ ప్రభుత్వ కుతంత్రం
ఈ దర్యాప్తు తదితర విషయాల పైన భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్‌ సిబల్‌ మాట్లాడుతూ, నేనప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్నాను. బ్రిటీష్వారి తుంటరితనం గురించి నాకు తెలుసు. వారు గుజరాత్‌కు తమ దౌత్యవేత్తను పంపించారు. ఒక విద్వేషపూరిత నివేదికను తయారు చేసి, ఢిల్లీలో ఉన్న ఐరోపా దేశాల దౌత్యవేత్తలందరికీ ఆ నివేదికను పంపించారు. ఒక దౌత్య వేత్త ద్వారా నాకు ఆ నివేదిక అందింది. భారత ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ నేను ఈ దౌత్యవేత్తలందరికీ ఒక నోట్‌ పంపించాను అని సిబల్‌ వివరించారు. ఇది ఇలా ఉండగా, సుప్రీంకోర్టు గోధ్రా అల్లర్లపై దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను నియమించింది. ఈ అల్లర్ల వెనుక కుట్ర ఏమీ లేదని సుప్రీంకోర్టు కూడా ఆ తర్వాత తేల్చిచెప్పింది. మోదీ, ఆయన ప్రభుత్వం నిర్దోషులని నిర్ధారిస్తూ సిట్‌ ఇచ్చిన నివేదికను జకియా జాఫ్రీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఈ అల్లర్లు అప్పటికప్పుడు పెట్రేగిపోయాయని, వీటి వెనుక కుట్రేమీ లేదని స్పష్టచేసింది.
న్యాయమూర్తులు ఏ.ఎం. ఖన్వీల్కర్‌, దినేశ్‌ మహే శ్వరి, సి.టి. రవికుమార్‌ తో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం దీనిపై రూలింగ్‌ ఇస్తూ, సిట్కు ఇందులో కుట్రేమీ కనిపించలేదు. స్టింగ్‌ కార్యకలాపాలు పేర్కొన్నట్టుగా గృహ దహనాలు, హింసా విధ్వంసకాండలు ఒక పథకం ప్రకారం కూడా జరగలేదు. ఈ సందర్భంగా ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనలు చేయలేదు. దీని వెనుక పథకం ఉందన్న ఆరోపణలో కూడా నిజం లేదు అని స్పష్టం చేసింది. గత జనవరి 17న బీబీసీ ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని ప్రసారం చేసింది. ఈ మొదటి భాగాన్ని ప్రసారం చేసే ముందు బీబీసీ2 ఛానల్‌ తన బీబీసీ వరల్డ్‌ న్యూస్లో ‘ది ఇంపాక్ట్‌’ అనే శీర్షిక కింద ఈ డాక్యు మెంటరీ గురించి 11 నిమిషాల పాటు వివరించింది. ఈ ఛానల్కు బ్రిటన్‌లో ఎక్కువ మంది వీక్షకులు లేరు కానీ, మిగిలిన ఐరోపా దేశాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో వీక్షకులున్నారు. ఈ సంఘటన మీద ఇతర ప్రపంచ దేశాలు కొద్దిగానైనా దృష్టి పెట్టాలనేది బీబీసీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. బ్రిటిష్‌ పౌరులు చూసినా చూడకపోయినా ఇతర ఐరోపా దేశాలకు సందేశం తెలియాలని బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News