Sunday, September 1, 2024
Homeఓపన్ పేజ్Central government on terrorism: ఉగ్రవాదులతో ఇక అమీ తుమీ!

Central government on terrorism: ఉగ్రవాదులతో ఇక అమీ తుమీ!

ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్నాయి. హతుల సంఖ్య కూడా పెరుగుతోంది. సైనికుల మీద దారి కాచి దాడులు చేయడమన్నది చివరికి జమ్మూకు కూడా విస్తరించింది. దోడా జిల్లాలో 16న ఉగ్రవాదులు సైనిక వాహనాల మీద దాడిచేసి ఒక సైన్యాధికారితో సహా అయిదుగురిని కాల్చి చంపారు. గత రెండు నెలల కాలంలో ఉగ్రవాదులు 25 మందికి పైగా సైనికులను చంపడంతో పాటు, 9 మంది పర్యాటకులను కూడా పొట్టనబెట్టుకున్నారు. నేరుగా దాడులు చేయడం, దారికాచి దాడులు చేయడం వంటి వాటిలో మొత్తం మీద హతుల సంఖ్య పెరుగుతోందన్నది అర్థమవుతోంది. కాశ్మీర్‌ లో నాలుగైదు రోజుల్లోనే వరుసగా నాలుగుసార్లు ఉగ్రవాదుల దాడుల జరిగాయి. జమ్మూ లోని కతువా పట్టణానికి 124 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నోటా గ్రామంలో సైనిక శకటాలపై ఉగ్రవాదులు గత 8వ తేదీన దారి కాచి దాడి చేయడంతో అయిదుగురు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2016 జూలై 8న దక్షిణ కాశ్మీర్‌ లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ నాయకుడు బుర్హాన్‌ వనీని సైనికులు హతమార్చినందుకు ప్రతీకారంగా, వనీ వర్ధంతి రోజును ఎంచుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టుగా కనిపిస్తోంది. కాగా, జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాదాపు రోజుకొక దాడికి పాల్పడుతూనే ఉన్నారు. ఇదివరకూ కాశ్మీర్‌ ప్రాంతానికే పరిమితమైన ఉగ్ర దాడులు క్రమంగా జమ్మూ ప్రాంతం వైపు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది.
సరికొత్త ఆయుధాలతో, సుశిక్షితులైన యువ ఉగ్రవాదులతో జమ్మూ కాశ్మీర్‌ లోకి చొరబాట్లు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. సెప్టెంబర్‌ 30 లోపు జమ్మూ కాశ్మీర్‌ లో శాసనసభ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడడాన్ని అర్థం చేసుకోవాల్సిందే. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన జరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఉగ్రవాద వర్గాలు ఎన్నికల లోపు మరింతగా దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉంది. ఈ దాడులు చేసింది తామేనంటూ కాశ్మీర్‌ టైగర్స్‌ అనే కొత్త ఉగ్రవాద వర్గం ప్రకటించింది. జైషే మహమ్మద్‌ అనే సంస్థే పాకిస్థాన్‌ సైనిక గూఢచారి సంస్థ ఐ.ఎస్‌.ఐ సహాయంతో ఈ దాడులు జరుపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుంది. నిజానికి, ఉగ్రవాదుల మీద సరికొత్త యుద్ధం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవు తోంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల ఏరివేతతో పాటు పాకిస్థాన్‌ ఆటకట్టించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఇప్పటికే ఆరు పర్యాయాలు దాడి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ విషయంగా పరిగణిస్తోంది. పైగా, ఉగ్రవాదులు తమ దాడులకు రాజౌరి-పూంచ్‌ రంగాన్ని ఎంచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున, అంటే గత జూన్‌ 9న ఉగ్రవాదులు రియాసి జిల్లాలో టూరిస్టు బస్సుపైన దాడి చేసి తొమ్మిది మందిని పొట్టనబెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో యాత్రికులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ప్రాంతంలో 1990లలోనూ 2000లలోనూ చొరబాట్లు ఎక్కువగా జరుగుతుండేవి. అయితే, గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటోంది. స్థానికుల సహాయ సహాకారాల వల్ల, 2003లో ఆపరేషన్‌ సర్ప వినాశ్‌ పేరుతో సైనికులు చేపట్టిన వ్యూహం వల్ల ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చాలావరకు సర్దుమణిగాయి.
ఈ విధంగా సైనికుల మీదా, పౌరుల మీదా తరచూ దాడులు జరగడం ఆధునిక రక్షణ పద్ధతుల్లో, టెక్నాలజీలో సుశిక్షుతలైన సైనిక బలగాలకు ఏమాత్రం సమంజసమైన వ్యవహారం కాదు. సైనిక బలగాలు మరింత కఠినంగా, మరింత చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తమ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను మరింతగా పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ పాటించడం వల్ల ఉగ్రవాద కార్య కలాపాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త రకం హింసా కాండలను చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాశ్మీర్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడానికి అనేక కారణాలుండవచ్చు. ఎక్కువ మంది సైనికులను తూర్పు లడఖ్‌ ప్రాంతానికి తరలించడం కూడా ఇందుకు కొద్దిగా దోహదం చేసి ఉండవచ్చు. చైనా బలగాల కారణంగా 2020 నుంచి తూర్పు లడఖ్‌ లో అత్యధిక సంఖ్యలో సైనిక బలగాల తరలింపు అవసరమవుతోంది. దీని ఫలితంగా ఇంటెలిజెన్స్‌ సిబ్బంది కూడా ఆ ప్రాంతం మీద దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది. ఉగ్రవాదుల దాడులను అరికట్టడానికి, ఉగ్రవాదులను మట్టు బెట్టడానికి ఏ మప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. అయితే, స్థానికులు, రాష్ట్ర పార్టీల సహాయ సహకారాలను కూడా తీసుకోవడం ముఖ్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News