ఆయుర్వేదంలో గంధాన్ని ఎక్కువగా వాడుతారు. మొహంపై మొటిమలను నివారించడానికి, తళతళ మెరిసేందుకు గంధాన్ని ఉపయోగిస్తారు. గంధం పొడి, పేస్ట్ లేదా నూనె రూపంలో ఉపయోగించవచ్చు.
అయితే, ఈ సహజసిద్ధమైన గంధం చర్మాన్ని సంరక్షించి మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటుంటారు. ఈ గంధం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా, దీన్ని వాడటం వల్ల ఏ చర్మ సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గంధం చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని అలర్జీల నుంచి రక్షించి మొటిమలను దూరం చేస్తుంది. ఒక టీస్పూన్ గంధం నూనె, చిటికెడు పసుపు, కర్పూరం కలిపి ముఖానికి ప్యాక్ లాగా రాసుకోవాలి. రాత్రాంత అలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే మొటిమలు, నల్లమచ్చలు పోతాయి.
తేలికపాటి ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాల వల్ల చందనం.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది మీ చర్మంపై నల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. టాన్ తొలగిస్తుంది. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి, కొబ్బరి నూనె కలపాలి. దీన్ని ముఖానికి పూసుకుని.. మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. డార్క్ స్పాట్స్ వదిలించుకోవడానికి, టాన్ లేకుండా ఉండేందుకు దీన్ని రెగ్యులర్ గా వాడాలి.
గంధపు చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఇది చర్మ ముడుతలను నివారించి వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. దీంతోపాటు చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. దీని కోసం, 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, 2 టేబుల్ స్పూన్ల గంధం కలపి రాయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడిగితే చాలు.
చాలా మంది పొడి, నిర్జీవమైన చర్మంతో బాధపడుతుంటారు. అలాంటివారు చందనం ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల పొడి, నిర్జీవమైన చర్మానికి చెక్ పెట్టవచ్చు. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పాలపొడి, కొన్ని చుక్కల గంధం నూనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాయాలి. 15 నిమిషాలు ఉంచి నీటితో కడిగితే చర్మం నిగారింపుగా మారుతుంది.
జిడ్డుగల చర్మంపై తరచుగా ధుమ్మ, ధూళి పేరుకుపోతుంది. అలాంటివారికి చందనం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో అర టీస్పూన్ గంధం పొడి, కొంచెం టమోటా రసం, అర టీస్పూన్ ముల్తానీ మట్టి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ని ముఖంపై పూసుకొని..15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.