వేసవి కాలంలో మామిడి పండ్లతో పాటు నేరేడు పండు విరివిగా దొరుకుతూ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని భావిస్తుంటారు. దీన్ని “ఇండియన్ బ్లాక్ బెర్రీ”గా కూడా పిలుస్తారు. తీపి, పులుపు, కొద్దిగా చేదు రుచి కలిగిన ఈ పండు ప్రత్యేకమైన రుచితో పాటు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ పండులో పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం వంటి శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే నేరేడు పండును తినే పద్ధతి సరిగా లేకపోతే, దీని వల్ల లాభాలకంటే ఇబ్బందులే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కొన్ని ఆహార పదార్థాలను నేరేడు పండు తిన్న వెంటనే తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం.
నేరేడు పండు తిన్న వెంటనే తినకూడని ఆహారాలు
- పాలు మరియు పాల ఉత్పత్తులు
నేరేడు పండులో ఉండే ఆమ్లతలు పాలలోని ప్రోటీన్స్తో కలిసి జీర్ణవ్యవస్థపై ప్రతికూలంగా పని చేస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది. కనుక ఈ పండును తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు పాలు, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి.
- నీరు
చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేరేడు పండు తిన్న వెంటనే నీరు తాగడం కూడా మంచిదికాదు. ఇది జీర్ణక్రియకు అంతరాయం కలిగించడంతో పాటు విరేచనాలు, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతుంది. కనీసం 30-40 నిమిషాల విరామం తరువాతే నీరు తాగాలి.
- ఖాళీ కడుపుతో
ఈ పండులో టానిక్ ఆమ్లాలు, ఆక్సాలిక్ ఆమ్లాలు ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తింటే అసిడిటీ, గ్యాస్, కడుపు మంట, వికారం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల ఈ పండును అల్పాహారం లేదా భోజనం చేసిన కొంత సమయం తర్వాత తినడం ఉత్తమం.
- కారం ఎక్కువగా ఉన్న ఆహారం
నేరేడు పండు తిన్న వెంటనే స్పైసీ ఆహార పదార్థాలు (చిప్స్, బజ్జీలు, కారంగా వండిన వంటలు) తినడం వల్ల జీర్ణ సమస్యలు ముదిరే అవకాశం ఉంది. ఈ కలయిక విషపూరితంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- ఊరగాయలు
ఊరగాయలలో ఉండే నూనె, వెనిగర్, ఉప్పు వంటి పదార్థాలు నేరేడు పండుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు ఇది దారి తీస్తుంది. కనుక ఊరగాయలను తినాలనుకుంటే కనీసం ఒక గంట గ్యాప్ ఇవ్వాలి.
తుదిగా…
నేరేడు పండు ఒక ప్రాకృతిక ఆరోగ్యవంతమైన పండు అయినప్పటికీ, దాన్ని సరైన సమయంలో, సరైన విధంగా తీసుకుంటేనే పూర్తి లాభాలు పొందవచ్చు. దీనిని తినే పద్ధతిలో జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.