Monday, November 17, 2025
Homeఇంటర్నేషనల్Unbearable Costs: అక్కడ బతకడమంటే యుద్ధమే... కేజీ చక్కెర 7 వేల రూపాయలు!

Unbearable Costs: అక్కడ బతకడమంటే యుద్ధమే… కేజీ చక్కెర 7 వేల రూపాయలు!

Israel-Gaza Conflict: ఇజ్రాయెల్-గాజా యుద్ధం (Israel-Gaza War) కేవలం భౌగోళికంగానే కాదు, ఆర్థికంగానూ గాజాను కుదేలు చేస్తోంది. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, కరెన్సీ కొరత ప్రజల నడ్డి విరుస్తోంది. ఒక కిలో చక్కెర రూ. 7,000, లీటరు పెట్రోల్ రూ. 2,000లకు అమ్ముడవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ దైనందిన అవసరాల కోసం ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలు గాజాలో ఈ కరెన్సీ కష్టాలకు కారణాలేంటి? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? 

- Advertisement -

నగదు కొరతకు కారణాలు – దళారుల దోపిడీ :  గాజాలో కరెన్సీ కొరతకు అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైనది, హమాస్ ఆయుధ కొనుగోళ్ల సామర్థ్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఇజ్రాయెల్ గాజాలోకి నగదు సరఫరాను నిలిపివేయడం. ఇది ఒక వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. మరోవైపు, గాజాలోని సంపన్న కుటుంబాలు బ్యాంకుల నుండి భారీగా డబ్బును ఉపసంహరించుకుని దేశం విడిచి వెళ్లిపోవడం కూడా నగదు లభ్యతను గణనీయంగా తగ్గించింది. విదేశీ వ్యాపారులు సైతం వస్తువుల విక్రయాలకు నగదునే డిమాండ్ చేస్తుండటంతో కొరత మరింత తీవ్రమైంది.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు, బ్రోకర్లు భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నారు. గతంలో షెకెల్‌ను డాలర్‌లోకి మార్చేందుకు 5 శాతం కమీషన్ తీసుకోగా, ఇప్పుడు అది ఏకంగా 40 శాతానికి పెరిగింది. ఇది సాధారణ ప్రజలకు పెద్ద భారం. “నిత్యవసరాలు కొనేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని” పాలస్తీనా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ షాప్ యజమాని షాహిద్ అజ్జూర్ లాంటి వారు, పిండి, ఆహార పదార్థాలు కొనేందుకు తమ బంగారాన్నే అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఆయనకు గతంలో రెండు రోజులకు 4 డాలర్లు ఖర్చవ్వగా, ఇప్పుడు 12 డాలర్లకు పెరిగింది.

ధరల మంట – ద్రవ్యోల్బణం, నిరుద్యోగం : యుద్ధం ముందు కిలో చక్కెర ధర 2 డాలర్లు ఉండగా, ఇప్పుడు 80-100 డాలర్లకు చేరింది. లీటరు పెట్రోల్ 25 డాలర్లు పలుకుతోంది. ఇది కేవలం దళారుల దోపిడీ మాత్రమే కాదు, భారీ ద్రవ్యోల్బణం ఫలితం కూడా. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2024 చివరలో గాజాలో 80 శాతం మంది నిరుద్యోగులు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగింది. గత ఏడాది ద్రవ్యోల్బణం 230 శాతం పెరిగింది. జనవరిలో తగ్గినప్పటికీ, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తప్పుకోవడంతో అది మళ్ళీ భారీగా పెరిగింది. సాధారణంగా, గాజా వాసులు తమ లావాదేవీలకు ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్‌ను ఉపయోగిస్తారు. అయితే, ఇజ్రాయెల్ నగదు సరఫరాను నిలిపివేయడంతో, పాత, చిరిగిపోయిన నోట్లను కూడా వ్యాపారులు అనుమతించడం లేదు, ఇది ప్రజల ఇబ్బందులను మరింత పెంచుతోంది.

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ – పరిమిత ప్రయోజనం : నగదు సంక్షోభం నుంచి బయటపడేందుకు పాలస్తీనా వాణిజ్య విభాగం గత ఏడాది డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే, నివేదికల ప్రకారం, ఇది కొంతమందికే అందుబాటులో ఉంది, ఇంకా విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువ కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులోకి వస్తేనే గానీ, ప్రజల కష్టాలు తీరే అవకాశం కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad