Gen Z Movement: హిమాలయ దేశం నేపాల్లో 26 సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ యువత తిరగబడి ఆందోళన (జెన్ జీ) చేపట్టడం ప్రభుత్వాన్ని కుదిపేసింది. యువతను నిలువరించడానికి పోలీసులు జరిపిన కాల్పుల 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ సహ మంత్రులంతా రాజీనామాలకు దారి తీసింది. యువ ఉద్యమానికి ఓ వ్యక్తి నాయకత్వం వహించాడు. అతడే 36 ఏళ్ల సుదన్ గురుంగ్.
జెన్ జీ అంటే..
ఇంగ్లిష్లో జనరేషన్ (తరం) జీ అంటారు. అంటే 1990 – 2010 మధ్య పుట్టిన వారు అని అర్థం. ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం కూడా అప్పుడే మొదలైంది. ఈ తరం వాతావరణ మార్పులు, సామాజిక న్యాయం, ప్రభుత్వాలు పారదర్శకతగా ఉండాలని డిమాండ్ యువతరం అని పేరు.
సుదన్ గురుంగ్ నేతృత్వంలో నిర్వహించే హమి నేపాల్ అనే ఎన్జీవో సంస్థ ఈ ఆందోళనను ముందుండి నడిపించింది. ఈ గ్రూపు ప్రదర్శనలు నిర్వహించేందుకు, విద్యార్థులు యునిఫామ్లో ఉండేందుకు, పుస్తకాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వాన్ని తామే అనుమతి కోరినట్లు ఇన్స్టా ద్వారా వెల్లడించింది. రోడ్లను ప్రభుత్వ దళాలు బ్లాక్ చేస్తుండటంతో ఈ సంస్థే విద్యార్థులకు ఆందోళన చేయాల్సిన మార్గాలను, సురక్షిత జాగ్రత్తలను సూచిస్తోంది.
ఎవరీ సుదన్..?
సుదన్ గురంగ్ ‘హమి నేపాల్’ సంస్థకు ప్రెసిడెంట్. 2015లో నేపాల్లో వచ్చిన భారీ భూకంపం తర్వాత ఆయనీ సంస్థను స్థాపించారు. ఆ విపత్తులో సుదన్ గురుంగ్ తన బిడ్డను కోల్పోయాడు. ఈ ఘటనతో ఈవెంట్ మేనేజర్గా ఉన్న అతడు ఎన్జీవోలో చేరి సేవా దృక్పథం అలవరచుకున్నాడు. గతంలో బీపీ కొయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పారదర్శకత కోరుతూ ఘోప క్యాంప్ పేరిట అవగాహన కార్యక్రమాలు చేపట్టాడు. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన ఉద్యమంలో డిజిటల్ యుగపు యువత ఆగ్రహాన్ని సుదన్ క్రమబద్ధీకరించారని పేరుంది.
యువత, విద్యార్థులే ఆయుధంగా..
నేపాల్లో జరిగిన తాజా ఆందోళనల్లో అత్యధికమంది యువత, పాఠశాల విద్యార్థులే పాల్గొన్నారు. సోషల్ మీడియాపై విధించిన నేషేధాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారింది.
‘నెపొ కిడ్’ను నిరసిస్తూ…
తాజాగా సోషల్ మీడియా కోసం ఆందోళన సమయంలో రాజకీయ వారసత్వాలపై నిరసనలు కూడా మొదలయ్యాయి. వీటిని నెపొ కిడ్ ఉద్యమంగా పిలుస్తున్నారు. సంపన్న వర్గాల, ఆధిపత్య రాజకీయ నాయకుల పిల్లలు అవినీతి సొమ్ముతో వచ్చే ఫలాలను అనుభవిస్తున్నారని.. ఆ పరిస్థితులు మారాలంటున్నారు.


