ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్ (ఎక్స్) బ్లూ బర్డ్ లోగోను అమ్మకానికి పెట్టింది ఓ సంస్థ. ఈ ఐకానిక్ బ్లూబర్డ్ లోగోకు ‘ఆర్ఆర్ ఆక్షన్’ సంస్థ వేలం నిర్వహించింది. ఈ వేలంలో 35వేల డాలర్లకు (దాదాపు రూ.30 లక్షలకు) లోగో అమ్ముడైంది. గతంలో శాన్ఫ్రాన్సిస్కోలోని హెడ్క్వార్టర్ వద్ద దర్శనమిచ్చిన 12 అడుగుల పొడుగు, 9 అడుగుల వెడల్పు, 254 కిలోల బ్లూ బర్డ్(Twitter Bird logo) గుర్తు దాదాపు రూ.30 లక్షలకు అమ్ముడైందని పేర్కొంది. అయితే వేలంలో దీనిని దక్కించుకున్న వ్యక్తి వివరాలను ఆయన అభ్యర్థన మేరకు ప్రకటించలేదు.
కాగా 2022 అక్టోబర్లో ట్విటర్ను 44 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సంస్థలో అనేక మార్పులు చేశారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. సంస్థ పేరును ట్విటర్ నుంచి ‘ఎక్స్’గా మార్చారు. బ్లూబర్డ్ లోగోను కూడా ‘ఎక్స్’తో రీ బ్రాండ్ చేశారు. కంటెంట్ మోడరేషన్లోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. అలాగే క్రియేటివ్ కంటెంట్ ఎక్కువగా కావాలనుకునే వారి నుంచి ఛార్జ్ వసూలు చేయడం మొదలుపెట్టారు.