జపాన్ తూర్పు తీరం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో భూకంపం నమోదై ప్రజలను కాసేపు భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రకంపనలు హొక్కైడో తూర్పు తీరంలో తీవ్రంగా నమోదు అయినట్లు ఆ దేశ వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకారం, భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి 20 కిలోమీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు వెలువడలేదు. భూకంపం సంభవించిన వెంటనే అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. బహుళ ప్రాంతాల్లో భవనాలు స్వల్పంగా కంపించినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే, ఇప్పటి వరకు ఏమైనా ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించినట్టు అధికారికంగా ప్రకటించలేదు. తాత్కాలికంగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా, భవిష్యత్తు పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధిక భూకంప ప్రభావిత దేశాల్లో జపాన్ ఒకటి కావడం, అక్కడి ప్రజలు ఇటువంటి ప్రకంపనలకు అలవాటుపడినా… ఈ స్థాయి తీవ్రత కలిగిన భూకంపం చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అధికారుల బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనలు కొనసాగిస్తున్నాయి.