అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హత్యకు కుట్ర జరుగుతోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆ దేశ ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇందుకు బలం చేకూరుస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘86 47’ అనే అంకెలను పోస్ట్ చేసి తొలగించారు. ఈ నెంబర్ ‘47వ అధ్యక్షుడిని చంపడం’ అనే అర్థం వచ్చేలా రహస్య కోడ్గా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశాయి.
ఈ క్రమంలో తన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారంటూ జేమ్స్ కామీ మరో పోస్ట్ పెట్టారు. తాను బీచ్లో నడుస్తున్నప్పుడు కనిపించిన కొన్ని గవ్వల చిత్రాన్ని పోస్ట్ చేశానని తెలిపారు. ఆ పోస్ట్లోని అంకెలను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ అంకెలను కొందరు హత్యలకు సంకేతంగా ఉపయోగిస్తారనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు.
కాగా గతంలో ట్రంప్పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి స్వల్ప గాయమైంది. ఆ తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్బీచ్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఫెన్సింగ్ వద్దకు తుపాకీతో వచ్చిన ఓ వ్యక్తిని భద్రతా దళాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఇలా పలు ఘటనల నేపథ్యంలో ట్రంప్కు భద్రతను అధికారులు భారీగా పెంచారు.