Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. టారీఫ్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఫర్నీచర్ దిగుమతులపైనా సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టారు. ‘‘అమెరికా (USA)లోకి వచ్చే ఫర్నీచర్పై టారీఫ్ ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నారు. దానిపై 50 రోజుల్లో ఆ విచారణ పూర్తవుతుంది’’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ ఫర్నీచర్ పై ఎంతమేరకు పన్నులు విధిస్తారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిషిగన్కు ఫర్నీచర్ ఇండస్ట్రీని తిరిగి రప్పించేందుకే ఈ చర్యలను తెలిపారు. యూఎస్లో ఫర్నీచర్, సంబంధిత పరిశ్రమలో జులై నాటికి 3,40,000 మంది ఉపాధి పొందుతున్నారు. 2000 సంవత్సరంతో పోల్చుకుంటే సగం మందే ఇప్పుడు ఆ రంగంలో పనిచేస్తున్నారు. ఇక, అగ్రరాజ్యానికి ఫర్నిచర్ను ఎగుమతి చేసే దేశాల్లో చైనా, వియత్నాం ముందువరుసలో ఉన్నాయి. 2024లో 25.5 బిలియన్ డాలర్ల విలువైన సామగ్రిని అమెరికా దిగుమతి చేసుకుందని గణాంకాలు వెల్లడించాయి.
Read Also: Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు ఊరట.. 9 శాతం దూసుకెళ్లిన షేర్లు
మరోవైపు, ఇప్పటికే స్టీల్, అల్యూమినియం, ఆటో, ఇతర రంగాలపై ట్రంప్ భారీగా పన్నులు విధిస్తున్నారు. ఫార్మా, చిప్స్, క్రిటికల్ మినరల్స్ దిగుమతులపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అంతేకాకుండా, భారత్పై రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు (Donald Trump) అదనపు సుంకాలు విధించారు. ఆగస్టు 27 నుంచి 50శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో ఇప్పటికే పేర్కొన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాల్లో భారత్ను ‘మహారాజ్’గా పేర్కొన్న ఆయన.. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోందని ఆరోపించారు. అమెరికా తమ పైనే ఎక్కువ సుంకాలు విధించడంలో లాజిక్ ఏంటో అర్థం కావడం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవలే అన్నారు.


