71 Maoists surrender in Chhattisgarh’s Dantewada: అగ్రనాయకుల ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లతో గత కొన్ని రోజులుగా మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతోంది. ఆపరేషన్ కగార్ ధాటికి వరుసగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇటీవలి కాలంలో అడపా దడపా లొంగిపోయిన వారు.. ఇప్పుడు ఒకేసారి పదుల సంఖ్యలో లొంగిపోవడం సంచలనంగా మారింది. బుధవారం ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. ఏకంగా 71 మంది మావోయిస్టులు లొంగిపోవడం చర్చనీయాంశమైంది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టుల్లో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. వీరిలో 30 మందిపై మొత్తం రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మావోయిస్టుల ఏరివేతను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేస్తుండటంతో లొంగిపోవడం తప్ప వారికి మరో మార్గం లేదన్నారు. వీరంతా గతంలో అనేక విధ్వంసక సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు బస్తర్ ఐజీ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని స్థానిక అధికారులు పేర్కొన్నారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలేది, హింసాయుత విధానాలకు స్వస్తి చెప్పి జనజీవన శ్రవంతిలో కలిపిపోవాలని విజ్ఙప్తి చేశారు. జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టుల వైపు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో వరుస పెట్టి పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/epfo-new-rule-atm-withdrawals/
వరుసగా లొంగిపోతున్న మావోయిస్టులు..
ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దాటికి మావోయిస్టు అగ్రనేతలు వరుస ఎన్కౌంటర్లలో హతమవుతున్నారు. ఇటీవల చత్తీస్ఘడ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు హతమయ్యారు. తాజాగా, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్రా రెడ్డి అలియాస్ వికల్ప్ ఎన్కౌంటర్తో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే.. చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడం సంచలనంగా మారింది. కాగా, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతపై సంచలన ట్వీట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా. అగ్రనాయకులను ఏరివేశామని.. మిగతా వారిని కూడా అంతం చేస్తామని ప్రకటించారు. మావోయిస్టులు తమంతట తాముగా వచ్చి పోలీసులకు లొంగిపోవాలని, లేని పక్షంలో తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.


